ప్రజాశక్తి - సాలూరు : తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మున్సిపల్ మెప్మా ఉద్యోగులు, యానిమేటర్లు బుధవారం స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. సిఐటియు జిల్లా కార్యదర్శి ఎన్వైనాయుడు, మెప్మా ఉద్యోగులు, యానిమేటర్ల సంఘం అధ్యక్షులు నాగిరెడ్డి సుగుణమ్మ, కార్యదర్శి అన్నపూర్ణ ఆధ్వర్యాన బోసు బొమ్మ జంక్షన్ నుంచి ప్రధాన రహదారి మీదుగా ర్యాలీ చేపట్టారు. అనంతరం మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా చేశారు. మెప్మా ఉద్యోగులకు సంబంధించిన సర్కులర్ 64ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కనీస వేతనం రూ.26వేలు చేయాలని కోరారు. ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. గత ఎన్నికల ముందు సిఎం జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ టి.జయరాంకి వినతిపత్రం అందజేశారు.










