మైనార్టీల సంక్షేమమే వైసిపి లక్ష్యం
- ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డి
టిడిపి నుంచి వైసిపిలోకి ముస్లిం మైనార్టీ సీనియర్ నాయకుడు జిఎం.గౌస్
ప్రజాశక్తి - నంద్యాల కలెక్టరేట్
ముస్లిం మైనార్టీల సంక్షేమమే వైసిపి ప్రభుత్వ లక్ష్యమని నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం నంద్యాలలోని శోభా లాడ్జిలో సీనియర్ ముస్లిం మైనార్టీ నాయకుడు జిఎం గౌస్ తన అభిమానులతో కలిసి టిడిపిని వీడి ఎమ్మెల్యే సమక్షంలో వైసిపిలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జిఎం గౌస్ టిడిపి వీడి స్వచ్చంధంగా వైసిపిలోకి రావడం సంతోషంగా ఉందన్నారు. నంద్యాల చరిత్రలో మొట్టమొదటిగా మైనార్టీ నాయకుడైన ఇసాక్ బాషాకు వ్యవసాయ మార్కెట్ యార్డు చైర్మన్గా పదవిని కల్పించామని, ప్రప్రథమంగా ముస్లిం మైనార్టీ మహిళ షేక్ మాబున్నీసాకు మున్సిపల్ చైర్మన్ అధికారాన్ని కల్పించిన ఘనత తమదేన్నారు. నంద్యాల బై ఎలక్షన్లో జగనన్న ముస్లిం మైనార్టీలకు ఇచ్చిన మాట ప్రకారం మైనార్టీ నాయకుడైన ఇసాక్ బాషకు ఎమ్మెల్సీ పదవిని ఇచ్చారని తెలిపారు. సీనియర్ నాయకుడు జిఎం గౌస్కు తగిన గౌరవం, హోదా కల్పిస్తామన్నారు. అనంతరం జిఎం గౌస్ మాట్లాడుతూ టిడిపి ఆవిర్భవించిన నాటి నుండి ముస్లిం మైనార్టీలకు ఆ పార్టీలో తగిన ప్రాధాన్యత కల్పించలేదని, పార్టీని నమ్ముకున్న నాయకులను మోసం చేశారని పేర్కొన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ముస్లిం మైనార్టీలకు తగిన న్యాయం, సముచిత స్థానం దక్కుతుందని తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఇసాక్ బాష, మున్సిపల్ చైర్మన్ మాబున్నీసా, ఆల్ ఇండియా మిల్లీ కౌన్సిల్ స్టేట్ ప్రసిడెంట్ మౌలానా అబ్దుల్ ఖదీర్, జమీయాతుల్ ఉలేమా స్టేట్ ప్రసిడెంట్ మౌలానా ఇలియాస్, ముస్లిం మైనార్టీ నాయకులు గన్నీకరీం, పార్థుడు, వైసిపి కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లు, మైనార్టీ నాయకులు పాల్గొన్నారు.










