
ప్రజాశక్తి - తిరుపతి బ్యూరో, తిరుపతి సిటి, యంత్రాంగం ప్రధాన బూర్జువా పార్టీలన్నీ కుర్చీల కోసం కొట్లాడుకుంటూ యాత్రలు చేస్తుంటే, సిపిఎం ప్రజా రక్షణ భేరి యాత్ర మాత్రం ప్రజా సమస్యల కోసం ప్రజలు పోరాడేలా చైతన్యవంతులను చేస్తోంది. చిత్తూరు, తిరుపతి జిల్లాలో రెండు రోజుల పాటు యాత్ర కొనసాగనుంది. తొలిరోజు శనివారం యాత్ర ఆద్యంతం స్వాగతాలు, ర్యాలీలు, వినతులు, క్షేత్రస్థాయి పరిశీలనలతో ఉత్సాహంగా సాగింది. ఆదివారం ఉదయం 9 గంటలకు రేణిగుంటలో, 11 గంటలకు శ్రీకాళహస్తిలో, 1 గంటకు గూడూరులో యాత్ర కొనసాగనుంది. కర్నూలు జిల్లా ఆదోనిలో ప్రారంభమైన యాత్ర శనివారం నాటికి ఎనిమిది జిల్లాల్లో పర్యటించినా రాష్ట్ర నాయకత్వంలో గానీ, కళాకారుల్లో గానీ ఎక్కడా కించత్తు విసుగు లేకుండా ఆద్యంతం అదే ఉత్సాహంతో సాగింది. సిపిఎం ప్రజా రక్షణ భేరి బస్సు యాత్ర అన్నమయ్య జిల్లా నుంచి చిత్తూరు జిల్లాలోకి శనివారం ఉదయం ప్రవేశించింది. గంగవరం ఫ్లై ఓవర్ బ్రిడ్జి నుంచి సిపిఎం కార్యకర్తలు, ప్రజాసంఘాలు ఘనంగా స్వాగతం పలికారు. అక్కడనుంచి స్కూటర్ ర్యాలీ నిర్వహించారు. యాత్ర ఆద్యంతం కరువు గాథలు తమకు ఎన్నో కనిపించాయని, బాధితులు వినిపించారన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, వెనుకబడిన రాయలసీమ ఉత్తరాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీలు ఇస్తామని హామీ ఇచ్చిన కేంద్రం మాట మార్చి రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేసిందన్నారు. రాయలసీమను కరువు ప్రాంతంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. పలమనేరులో పట్టు, పాడి, మామిడి రైతులను తక్షణం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. గిట్టుబాటు ధర లభించేవరకూ కోల్డ్స్టోరేజీలు నిర్మించి నిల్వ ఉంచాలని కోరారు. బంగారుపాళ్యంలో సిపిఎం రాష్ట్ర నాయకులు వి.క్రిష్ణయ్య మాట్లాడారు. రాష్ట్రంలో నీటి ప్రాజెక్టులను ఎందుకు పూర్తి చేయడం లేదని ప్రశ్నించారు. 60వేల టిఎంసిల నీరు వృథాగా సముద్రంలో కలిసిపోతుందన్నారు. పాదయాత్ర సందర్భంగా ఈ ప్రాంతానికి వచ్చిన జగన్మోహన్రెడ్డి రైతులకు ఇచ్చిన హామీని ఒక్కటైనా నిలబెట్టుకున్నారా? అని ప్రశ్నించారు. యాత్రలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు డి.రమాదేవి, రాష్ట్ర నాయకులు ఉమా మహేశ్వరరావు, దయా రమాదేవి, శివ నాగరాణి, సిపిఎం చిత్తూరు జిల్లా కార్యదర్శి వాడ గంగరాజు, చైతన్య సురేంద్ర, ఓబుల్ రాజు, గిరిధర్ గుప్తా తదితరులు పాల్గొన్నారు. యాత్ర బృందానికి పంచాయతీ కార్మికులు, హమాలీ వర్కర్స్, టీచర్లు, చేనేత కార్మికులు, అంగన్వాడీ, ఆశా కార్యకర్తలు, మధ్యాహ్నం భోజనం కార్మికులు తదితరులు తమ సమస్యలు ప్రభుత్వం దష్టికి తీసుకెళ్లాలని వినతి పత్రాలు సమర్పించారు. పాకాలవారిపల్లి వద్ద తిరుపతి జిల్లాలోకి యాత్ర ప్రవేశించింది. అక్కడనుంచి తిరుచానూరు యోగిమల్లవరంలో సభ సుమన్ అధ్యక్షతన జరిగింది. అనంతరంలో జోరువానలో బహిరంగ సభ సాగింది. బిజెపికి బుద్ధి చెప్పాలి : సిపిఎం అభివృద్ధిని విస్మరించిన బిజెపికి తగిన బుద్ధి చెప్పాలని సిపిఎం కేంద్రకమిటి సభ్యులు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎంఎ గఫూర్, డి.రమాదేవి అన్నారు. తిరుచానూరు, తిరుపతిలో ప్రజారక్షణ భేరి సభలు శనివారం సాయంత్రం జరిగాయి. తిరుపతి పాత కార్పొరేషన్ కార్యాలయం వద్ద సభ జరుగుతున్న సందర్భంగా జోరున వాన కురిసింది. రాయలసీమకు ప్రత్యేక నిధుల ఊసే లేదన్నారు. కడప ఉక్కు కర్మాగారం మాట దేవుడెరుగు, ప్రస్తుతం విశాఖలో ఉన్న స్టీల్ ప్లాంట్ను సైతం కార్పొరేట్ శక్తులకు అప్పగించేందుకు కేంద్రం పూనుకోవడం బాధాకరమన్నారు. రాజధానికి ఇస్తామన్న నిధులు ఇవ్వలేదని, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందాన ఉందన్నారు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్న బిజెపిని, ఆ పార్టీకి మోకరిల్లుతున్న టిడిపి, వైసిపి, జనసేనలకు బుద్ధి చెప్పాలన్నారు. ఇటీవల తిరుపతి శెట్టిపల్లి భూములకు పట్టాలివ్వడం శుభపరిణామని, ఇచ్చిన పట్టాలకు భూములు చూపించాలని, ఇళ్లు నిర్మించుకునేందుకు సహకరించాలని కోరారు. సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ దేశంలో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటాయన్నారు. ఉల్లిగడ్డలు, టమోటాలు కొనలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. దేశ సంపదనను అదానీ, అంబానీలకు మోడీ దోచి పెడుతున్నారన్నారు. భిన్నమతాలు, బిన్న సంస్కృతులు ఉన్న దేశంలో ఒకే మతం, ఒకే సంస్కృతి అనేలా వ్యవహరించడం శోచనీయమన్నారు. తమ బస్సు యాత్ర వస్తున్న రోడ్లకు ఇరువైపులా లక్షలాది ఎకరాల భూములు బీడుగా మారాయన్నారు. సిపిఎం తిరుపతి జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు మాట్లాడుతూ తిరుపతి అభివృద్ధి అంటేనే బిజెపికి నచ్చడం లేదన్నారు. తిరుపతిలో ఫ్లై ఓవర్ నిర్మించకూడదని, అండర్ డ్రైనేజి వ్యవస్థ నిర్మాణం చేపట్టకూడదని, ఆఖరికి ఆస్పత్రుల నిర్మాణం చేపట్టినా అడ్డుకోవడమే బిజెపి పనిగా పెట్టుకుందన్నారు. రాబోవు రోజుల్లో బిజెపికి తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. జోరు వాన కురుస్తున్నా ప్రజలు సిపిఎం సభలో పాల్గొని విజయవంతం చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా నాయకులు చల్లా వెంకటయ్య, కందారపు మురళి, టి సుబ్రహ్మణ్యం, హేమలత, సాయి లక్ష్మి, నాగార్జున, జయచంద్ర, బుజ్జమ్మ, గంగులప్ప, వేణు, మునిరాజా పాల్గొన్నారు. నేటి సభను జయప్రదం చేయాలి : బివి రమణయ్య గూడూరు టౌన్ : గూడూరులోని మార్కెట్ సెంటర్లో ఆదివారం జరగనున్న ప్రజా రక్షణ బేరి బహిరంగ సభను జయప్రదం చేయాలని జిల్లా అధ్యక్షులు బి.వి.రమణయ్య కరపత్రాలను పంచిపెట్టారు.