మాదక ద్రవ్యాలతో యువత భవిష్యత్తు అంథకారం
స్పెషల్ ఎన్ఫోర్సుమెంట్ ఇన్స్పెక్టర్ ఎంఆర్కె దాసు
ప్రజాశక్తి-కలెక్టరేట్ (కృష్ణా)
మాదక ద్రవ్యాలకు అలవాటు పడితే యువత భవిష్యత్తు అంథకారం అవుతుందనీ, యువత వీటికి దూరంగా ఉండేలా స్వచ్ఛంద సంస్థలు, డ్రగ్ డిఎడిక్షన్ సెంటర్ కౌన్సిలర్లు కృషి చేయాలని స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ ఇన్స్పెక్టర్ ఎం.ఆర్.కె దాసు సూచించారు. కృష్ణాజిల్లా విభిన్న ప్రతిభావంతులు, టి.జి, వయోవృద్ధుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు ఆధ్వర్యంలో సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం వారి మాదక ద్రవ్యాల దుర్వినియోగ నివారణ జాతీయ, రాష్ట్ర కార్యాచరణ ప్రణాళికలో భాగంగా డ్రగ్ డిఎడిక్షన్ సెంటర్ కౌన్సిలర్లు, ఈ రంగంలో పని చేస్తున్న ఎన్.జి.ఓ లకు నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమాలు రెండో రోజు ఆదివారం కలక్టరేట్ లోని స్పందన సమావేశ హాలులో నిర్వహించారు. ఈ సందర్భంగా దాసు మాట్లాడుతూ నేటి యువత కొంతమంది మత్తు పదార్థాలు తీసుకుంటున్నట్లు మనం సామాజిక మాధ్యమాల్లో చూస్తున్నామన్నారు. విభిóన్న ప్రతిభావంతులు, టి.జి, వయోవృద్ధుల సంక్షేమశాఖ సహాయ సంచాలకులు బి.రామ్ కుమార్ మాట్లాడుతూ తెలిసో తెలియకో మత్తు పదార్థాల భారిన పడిన యువతను చైతన్య పరచి ఆ వ్యసనాలతో ముంచుకొచ్చే అనర్ధాలను అర్ధం అయ్యేలా చెప్పాలని సూచించారు. సైకాలజిస్టు గర్రే శంకరరావు మాట్లాడుతూ మాదకద్రవ్యాల అలవాటును తొలి దశలోనే గుర్తిస్తే చాలా వరకు మాన్పించొచ్చునన్నారు. ఈ కార్య క్రమంలో సైకాలజిస్టులు, రిసోర్స్ పర్సన్లు శ్రావణి, విజయరత్నం, రవి భార్గవ, ఎల్.వి రావు, హనుమంతరావు, హిమబిందు పాల్గొన్నారు.










