ప్రజాశక్తి-ఆదోనిరూరల్ : అనేక గ్రామాలలో అంటరానిత, రెండు గ్లాసుల పద్ధతి, వివక్షతకు వ్యతిరేకంగానే కెవిపిఎస్ ఆధ్వర్యంలో ఎన్నో పోరాటాలు చేసి ఫలితం సాధించామని కెవిపిఎస్ మండల కార్యదర్శి తిక్కప్ప అన్నారు. కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం ఏర్పాటు చేసి 25 సంవత్సరాలు చేరుకున్న సందర్భంగా మండలం పరిధిలో సంతేకూడ్లూరు గ్రామంలో జెండాను కెవిపిఎస్ గ్రామ నాయకులు రాము, అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి కెవిపిఎస్ జెండా ఆవిష్కరించారు. కార్యక్రమానికి కెవిపిఎస్ మండల కార్యదర్శి తిక్కప్ప అధ్యక్షత వహించారు.ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కే.లింగన్న మాట్లాడుతూ కేవీపీఎస్ 1998 సంవత్సరం అక్టోబర్ రెండో తేదీన ఏర్పాటు చేసుకొని ఆనాటి నుండి ఈనాటి వరకు కుల వివక్షత అంటరానితనం దళితులపై దాడులు దౌర్జన్యాలు మరియు దళిత కాలనీల అభివృద్ధి కోసం ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధుల కోసం అనేకమైన ఉద్యమాలు చేసిందని తెలిపారు. కెవిపిఎస్ ఆవిర్భావం అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా చేసిన ఆందోళన ఫలితంగా అప్పటి ప్రభుత్వం జస్టిస్ పున్నయ్యతో కమిషన్ ఏర్పాటు చేసి రాష్ట్రవ్యాప్తంగా పర్యటించడం జరిగిందని తెలిపారు. దేశంలో ఇప్పటికే దళితులపై దాడులు దౌర్జన్యాలు జరుగుతూ ఉన్నాయని, రాష్ట్రంలో కూడా కులవివక్షత, అంటరానితనం ఇంకా అనేక గ్రామాల్లో కొనసాగుతుందని దీన్ని రూపుమాపడానికి కేవీపీఎస్ ను మరింత బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ గ్రామ నాయకులు రాజుకుమార్, వీరేష్ ఎల్లప్ప, మధు, అమ్రేష్, వీరస్వామి, నాగరాజు, రామప్ప, ఏలీయా పాల్గొన్నారు.










