Oct 21,2023 00:33

ఆందోళన చేపడుతున్న గ్రామస్తులు

ప్రజాశక్తి-డుంబ్రిగుడ: రంగిలిసింగి పంచాయితీ ముసర్లంక, కింజేరు కుడబీర్‌ గ్రామాల్లోని గ్రావిటీ పథకాలను వెంటనే మరమత్తు చేసి తగునీటి సౌకర్యం పునరుద్ధరించాలని కోరుతూ ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో ఆ గ్రామస్తులు శుక్రవారం కింజేరు గ్రామంలో ఖాళీ బిందెలతో నిరుపయోగంగా ఉన్న గ్రావిటీ టేపుల వద్ద ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా గిరిజన సంఘం మండల ఉపాధ్యక్షుడు కె.దోంబు మాట్లాడుతూ ఆ గ్రామాల్లో ఏర్పాటు చేసిన సోలార్‌ గ్రావిటీ పథకాలు సుమారు ఐదు నెలల నుంచి మరమత్తుకు నోచుకోకపోవడంతో గ్రామస్తులు తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. తప్పని పరిస్థితిలో గ్రామానికి సమీపంలో ఊట గెడ్డలను పొలాల నుంచి వచ్చే నీటిని సేవిస్తూ పలు అనారోగ్యాలకు గురవు తున్నారని చెప్పారు. పలుమార్లు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినా ఇప్పటివరకు మరమ్మత్తు చేపట్టలేదన్నారు. తక్షణమే సంబంధిత అధికారులు స్పందించి గ్రావిటి పథకాలను మరమ్మతు చేసి వెంటనే తాగునీరు అందించాలని డిమాండ్‌ చేశారు.లేనిపక్షంలో జిల్లా కలెక్టర్‌ కు ఫిర్యాదు చేస్తామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆ గ్రామ మహిళలు పాల్గొన్నారు.