Sep 12,2023 11:23

అంతర్జాతీయ మోడల్‌గా స్కూల్‌ వికీ పోర్టల్‌
ఇంటర్నెట్‌ కనెక్టివిటీలోముందంజ
కేరళపై యునెస్కో ప్రశంసలు
తిరువనంతపురం : 
 కేరళ ఉచిత సాఫ్ట్‌వేర్‌లో ఛాంపియన్‌గా ఉందని, అంతర్జాతీయ మోడల్‌గా స్కూల్‌ వికీ పోర్టల్‌ను తీర్చిదిద్దిందని, దేశంలోనే ఇంటర్నెట్‌ కనెక్టివిటీలో ముందంజలో ఉందని యునెస్కో ప్రశంసల వర్షం కురిపించింది. యునెస్కో ప్రచురించిన 2023 గ్లోబల్‌ ఎడ్యుకేషన్‌ మానిటరింగ్‌ రిపోర్ట్‌ కేరళను ప్రశంసించింది. కేరళ విద్యా రంగంలో సాంకేతికతను అనుసంధానం చేసినందుకు ఈ గుర్తింపు లభించిందని ఆ రాష్ట్ర సాధారణ విద్యాశాఖ మంత్రి వి.శివంకుట్టి తెలిపారు. యునెస్కో నివేదికలో రాష్ట్ర విద్యా రంగంలో సాంకేతికత వినియోగం గురించి మూడు ప్రత్యేక ప్రస్తావనలు ఉన్నాయి. కైట్‌ నాయకత్వంలో పనిచేస్తున్న స్కూల్‌ వికీపోర్టల్‌ గురించి నివేదిక ప్రముఖంగా ప్రస్తావించింది. 'నాణ్యత - కంటెంట్‌ సృష్టి యొక్క వైవిధ్యాన్ని కలిసికట్టుగా పనిచేయడం మెరుగుపరుస్తుంది' అనే శీర్షికతో స్కూల్‌ వికీపోర్టల్‌ను ఒక అంతర్జాతీయ మోడల్‌గా నివేదిక ప్రశంసించింది. ఉచిత సాఫ్ట్‌వేర్‌ వికీమీడియా ప్లాట్‌ఫారమ్‌పై అభివృద్ధి చేసిన స్కూల్‌ వికీపోర్టల్‌లో భాగస్వామ్య పద్ధతిలో 15,000 కంటే ఎక్కువ పాఠశాలల్లో కంటెంట్‌ను అభివృద్ధి చేయడం గొప్ప విజయం అని యునెస్కో నివేదిక పేర్కొంది. స్కూల్‌ వికీ (www.schoolwiki.in) పోర్టల్‌ అనేది భారతదేశ విద్యా రంగానికి సంబంధించి స్థానిక భాషలో అతిపెద్ద సమాచార రిపోజిటరీ. ఇందులో పాఠశాలలు, స్టేట్‌ స్కూల్‌ ఆర్ట్‌ ఫెస్టివల్‌ కంపోజిషన్‌లు, పెయింటింగ్‌లు, డిజిటల్‌ మ్యాగజైన్‌లు, కోవిడ్‌ కాలం నాటి కంపోజిషన్‌లకు సంబంధించిన సమాచారం ఉంటుంది. కేరళలోని పాఠశాలల్లో డిజిటల్‌ విద్య కోసం ఉచిత సాఫ్ట్‌వేర్‌లు మాత్రమే ఉపయోగించడాన్ని కూడా యునెస్కో ప్రత్యేకంగా పేర్కొంది. 'ఉచిత సాఫ్ట్‌వేర్‌లో కొన్ని దేశాలు ఛాంపియన్‌లుగా మారాయి' అనే శీర్షికతో దీనిని గురించి నివేదిక వివరించింది. కేరళ రాష్ట్ర ప్రభుత్వ ఉచిత సాఫ్ట్‌వేర్‌ విధానాన్ని ప్రముఖంగా పేర్కొంటూ... రాష్ట్రంలో వివిధ పాఠశాలల్లో సుమారు రెండు లక్షల ల్యాప్‌టాప్‌లు ఉచిత సాఫ్ట్‌వేర్‌ అప్లికేషన్లతో పనిచేస్తున్నట్లు నివేదిక తెలిపింది.

డిజిటల్‌ ఎడ్యుకేషన్‌లో ఉచిత సాఫ్ట్‌వేర్‌ వినియో గంతో కేరళ ప్రభుత్వం రూ.3,000 కోట్లు ఆదా చేసిందనే వాస్తవాన్ని నీతి ఆయోగ్‌తో సహా అనేక సంస్థలు ఇప్పటికే గుర్తించాయి. యునెస్కో నివేదికలోని మూడవ ప్రస్తావన ప్రకారం పాఠశాల ల్లో అత్యధిక ఇంటర్నెట్‌ కనెక్టివిటీ విషయంలో దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే కేరళ ముందుంది.