Apr 20,2023 22:22

matladutunna dmho geethabhayi

కుటుంబ వైద్యానికి అత్యధిక ప్రాధాన్యత

ప్రజాశక్తి-పమిడిముక్కల
రాష్ట్రప్రభుత్వం నూతనంగా ప్రారంభించిన ఫ్యామిలీ ఫిజీషియన్‌ ద్వారా ప్రజలందరికీ వైద్య సేవలు అందించటమే లక్ష్యమని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారిణి జి.గీతాభాయి అన్నారు. పమిడిముక్కల మండలంలోని కపిలేశ్వరపురం పరిధిలోని మంటాడ సచివాలయంలో ఫ్యామిలీ ఫిజీషియన్‌ క్యాంపును గురువారం ఆమె పరిశీలించారు ఈ సందర్భంగా గీతాభాయి మాట్లాడుతూ సిఎం వైఎస్‌ జగన్మోహనరెడ్డి ప్రజలకు పూర్తిస్థాయిలో వైద్య సేవలు అందించటానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. రాష్ట్రప్రభుత్వం రూపొందించిన వైద్య విధానాన్ని జిల్లాలో పెద్దఎత్తున అమలు చేయటానికి నిరంతరం కృషిచేస్తున్నామన్నారు. ప్రజలకు వైద్యం అందించే క్రమంలో 105 రకాల మందులు, 14 పరీక్షలను చేయిస్తున్నామన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో పౌష్టికాహారం గర్భిణీలకు అందజేయడంలో నిర్లక్ష్యం వహించొద్దని కోరారు. పిల్లలకు ఐరన్‌ టాబ్లెట్‌లు అందించాలన్నారు. వేసవి కాలమైనందున ప్రతిఒక్కరూ వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. జిల్లాలోని అన్ని ఆసుపత్రుల్లో రోగులకు అవసరమైన మందులు, సిబ్బంది అందుబాటులో ఉంచామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్‌ మమత, డాక్టర్‌ బాలాజీ ఏఎన్‌ఎం శ్రీలక్ష్మి, ఆశా వర్కర్లు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.