Nov 03,2023 23:22

ప్రజాశక్తి - కుప్పం
కుప్పం అంగన్‌వాడి ప్రాజెక్టులో నిరంతరం అంగన్వాడీలను వేధిస్తున్న అధికారిపై చర్యలు తీసుకోవాలని శుక్రవారం కుప్పం ప్రాజెక్టు కార్యాలయం వద్ద సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. ఈ సందర్భంగా ఎ పి. అంగన్వాడి వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర కోశాధికారి ఎస్‌.వాణిశ్రీ, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు వాడ గంగరాజు మాట్లాడుతూ కుప్పం ప్రాజెక్టు అధికారి తమ సమస్యలను పరిష్కరించకుండా వర్కర్స్‌ పై కక్ష సాధింపు చర్యలకు దిగుతోందని, ఇప్పటికే ప్రతినెలా వేతనాల కోత విధిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో కలెక్టర్‌కి సమస్యలపై రాతపూర్వకంగా వినతిపత్రం ఇచ్చినప్పటికీ ఐసీడీఎస్‌ ఉన్నతాధికారులతో సమన్వయ కమిటీ సమావేశం ఏర్పాటు చేసి సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్పినా అది జరగలేదు. దీంతో ఇంకా రెచ్చిపోయిన ప్రాజెక్టు అధికారి రాష్ట్రవ్యాప్తంగా తమ సమస్యలు పరిష్కారం కోసం గత నెల 25న చలో విజయవాడ కార్యక్రమానికి పిలుపునిచ్చిన సందర్భంలో కుప్పం నుంచి అందరూ బయలుదేరి వెళ్ళగా మధ్యలో పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు. ఈ అరెస్టులకు నిరసనగా 25న కుప్పంలో రాస్తారోకో నిర్వహించి కుప్పంలో ఉన్న ఎమ్మెల్సీ శ్రీకాంత్‌ కు వినతిపత్రం ఇవ్వడానికి వెళ్లగా ఇదే అదునుగా చూపి పార్టీ మీటింగ్‌ కు అంగన్వాడీలు వెళ్లారని షోకాజ్‌ నోటీసులు ఇచ్చారు. షోకాజ్‌ నోటీసులకు సమాధానం ఇచ్చినప్పటికీ ఉద్దేశపూర్వకంగానే 50 మందికి వేతనాల కోత విధిస్తూ, ఇద్దరు నాయకులని విధుల నుంచి తొలగిస్తున్నట్లు నోటీసులు పంపారు. దీనిని వారు తీవ్రంగా ఖండించారు. కుప్పంలో అధికార పార్టీ నాయకులు ఏది చెప్తే అది ఆ అధికారి వింటూ వేధింపులు గురిచేయడం దుర్మార్గమన్నారు. ఈ వేధింపులు మానుకోవాలని పదే పదే ఉన్నతాధికారులకు చెబుతున్నప్పటికీ ఎందుకు ఆ అధికారిపై చర్యలు తీసుకోవడం లేదో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనాకలెక్టర్‌ జోక్యం చేసుకొని తప్పుడు పద్ధతిలో వేధింపులకు గురిచేస్తున్న కుప్పం ప్రాజెక్టు అధికారపై చర్యలు తీసుకోకపోతే జిల్లా, రాష్ట్ర వ్యాప్త ఉద్యమంగా తీసుకెళ్తామని హెచ్చరించారు. కుప్పంకు శుక్రవారం విచ్చేసిన జిల్లా పీడీ పరిష్కరించే దిశగా మాట్లాడకుండా రెచ్చగొట్టే పద్ధతిలో మాట్లాడటం దారుణమని నాయకులు మండిపడ్డారు. తప్పుచేసిన సిడిపిఒపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా , వర్కర్లను బెదిరించడం ఏంటని ప్రశ్నించారు. ఈ ధర్నాలో నాయకులు లలిత, శ్యామల, పద్మ, లీల, కస్తూరి, శారద, ప్రమీల, కవిత పాల్గొన్నారు.