
ప్రజాశక్తి - బుట్టాయగూడెం
వలస ఆదివాసీలకు, గుత్తి కోయలకు కుల ధృవీకరణ పత్రాలు, గిరిజనుల పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని కరుతూ సిపిఐ ఎం ఎల్ ప్రజాపంథా ఆధ్వర్యంలో కెఆర్.పురం ఐటిడిఎ వద్ద బుధవారం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా గిరిజనులు ప్రదర్శన చేపట్టారు. అనంతరం ఐటిడిఎ వద్ద ధర్నా చేశారు. ఈ సందర్భంగా సిపిఐఎంల్ ప్రజా పంథా జంగారెడ్డిగూడెం డివిజన్ కార్యదర్శి ఎస్కె.గౌస్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కెచ్చల రంగారెడ్డి మాట్లాడుతూ వలస ఆదివాసీల పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్యంగా ఉన్నాయని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒరిస్సా, ఛత్తీస్ఘడ్ రాష్ట్రాల్లో సుమారు 250 గ్రామాల 80 వేల మంది గుత్తికోయలు పోడుభూముల్లో ఎంతోకాలంగా వ్యవసాయం చేసుకుని జీవిస్తున్నారని, నేటికీ వారికి పట్టాలివ్వడంలో కాలయాపన చేస్తున్నారని, ప్రభుత్వం గిరిజనుల కోసం వారి అభివృద్ధి కోసం గిరిజన సంక్షేమం కోసం పనిచేస్తున్నామనే జగన్ ప్రభుత్వం మాటలు ఆచరణలో లేవన్నారు. గౌస్ మాట్లాడుతూ కుక్కునూరు, వేలేరుపాడు తదితర మండలాల్లో వలస ఆదివాసీలు 30 ఏళ్ల నుండి గ్రామాల్లో నివాసాలు ఏర్పాటు చేసుకుని అడవిపై ఆధారపడి జీవిస్తున్నారని, కేంద్ర ప్రభుత్వ గిరిజన కమిషన్ వీరికి ఎస్టి కులం సర్టిఫికెట్లు ఇవ్వాలని దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలకు ఆదేశాలిచ్చినప్పటికీ పక్క రాష్ట్రాల నుండి వచ్చి ఇతర రాష్ట్రాల నుండి వచ్చి జీవిస్తున్నారని వీరిపై స్థానిక అధికారులు వివక్ష చూపుతున్నారని, 21వ అధికరణం ప్రకారం దేశంలో భారతీయ పౌరులుగా ఎక్కడైనా వెళ్లి జీవించొచ్చని, వీరికి ఎస్టి కుల ధృవీకరణ పత్రాలివ్వకపోవడం వల్ల వారి పిల్లలు విద్య, ఉద్యోగాలు కోల్పోతున్నారని, ప్రభుత్వ పథకాలు అందడం లేదని తెలిపారు. గ్రామాల్లో రోడ్లు, పాఠశాలలు నిర్మించాలని, తాగునీరు, వైద్య సౌకర్యం కల్పించాలని, ఫారెస్ట్ అధికారుల దాడులు ఆపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా నాయకులు ఎస్.రామారావు, డి.ముత్యాలరావు, బి.సత్యనారాయణ,జి.ప్రభాకర్, డివిజన్ నాయకులు సోయం చంద్రబాబు, మడకం మల్లేష్, కొండా ప్రకాష్, తిరుమలాపురం సర్పంచి సోడే విజయ పాల్గొన్నారు.