Jul 24,2023 19:00

విద్యార్థులను సన్మానిస్తున్న నాయకులు

ప్రజాశక్తి - మంత్రాలయం
పదో తరగతి పరీక్ష ఫలితాల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థినులకు వైసిపి నాయకులు జనార్ధన్‌ రెడ్డి ఆర్థికంగా ప్రోత్సాహం అందజేశారు. సోమవారం మండలంలోని చిలకలడోన గ్రామ సమీపంలో ఉన్న కస్తూరి బా గాంధీ పాఠశాలలో విద్యార్థులను అభినందించారు. ఇటీవల పదో తరగతి ఫలితాల్లో అత్యధిక మార్కులతో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థినులకు ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి పుట్టినరోజు సందర్భంగా తనవంతు సహకారం కింద రూ.5 వేలు అందజేస్తామని గతంలో జనార్ధన్‌ రెడ్డి హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం ఎమ్మెల్యే పుట్టినరోజు సందర్భంగా మరుసటి రోజు అత్యధిక మార్కులు ద్వారా ఉత్తీర్ణత సాధించిన కె.మేఘన (487)కు రూ.3 వేలు, ప్రమీల రాణి (482) రూ.2 వేల నగదును వైసిపి మండల కన్వీనర్‌ జి.భీమిరెడ్డి, జనార్ధన్‌ రెడ్డి, సచివాలయ కో కన్వీనర్‌ వికెసి రాఘవేంద్రాచారి అభినందించారు. ఇంటర్‌లోనూ మంచి మార్కులతో రాణించాలంటూ వారి చేతులమీదుగా అందజేసి శాలువాతో విద్యార్థినులను సన్మానించారు. సర్పంచి తెల్లబండ్ల భీమయ్య, వెంకటరెడ్డి, కరస్పాండెంట్‌ శాంతి పాల్గొన్నారు.