కష్టపడి చదివితే ఖచ్చితంగా ఫలితం
- టిటిడి ఇఒ ధర్మారెడ్డి
ప్రజాశక్తి - నందికొట్కూరు
జీవితంలో ఎవరైనా సరే కష్టపడితే తప్పనిసరిగా ఫలితం దక్కుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం ఇఒ ఎవి ధర్మారెడ్డి పేర్కొన్నారు. బుధవారం జూపాడుబంగ్లా మండలంలోని పారుమంచాల గ్రామంలోని జిల్లా పరిషత్ పాఠశాల ఆవరణంలో పాఠశాలకు నిశ్చల్ నారాయణ్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో రూ.25 లక్షలు విలువైన ల్యాబ్ మెటీరియల్స్, పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి నిశ్చల్ ఫౌండేషన్ చైర్మన్, టిటిడి మాజీ బోర్డ్ డైరెక్టర్ నిశ్చల్ నారాయణ్, నాగేశ్వర రావు, పద్మావతిలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా టిటిడి ఇఒ ఏవి ధర్మారెడ్డి మాట్లాడుతూ ఈ పాఠశాలలోనే ఎంతో మంది చదువుకొని పెద్ద పెద్ద స్థాయిలో ఉద్యోగాల్లో ఉన్నారన్నారు. 1 తరగతి నుండి 10వ తరగతి వరకు తాను ఈ స్కూల్ లో చదువుకున్నానని గుర్తు చేశారు. తన మిత్రులు నాగేశ్వరరావు నాతో కలిసి టిటిడి బోర్డ్ మెంబర్గా నాలుగేళ్లు కలిసి పని చేశారన్నారు. ఈయన కుమారుడు నిశ్చల్ నారాయణ్ మ్యాథ్స్లో దిట్ట అని వారి ఫౌండేషన్ ద్వారా పాఠశాలకు నాలుగు ల్యాబ్లు, విద్యార్థులకు పుస్తకాలు ఇవ్వాలని పిలవడం జరిగిం దన్నారు. అందుకు నిశ్చల్ వారి ఫౌండేషన్ ద్వారా రూ.25 లక్షలు విలువైన నాలుగు రకాల ల్యాబ్ మెటీరియల్స్, పుస్తకాలు అందజేసేందుకు రావడం అభినందనీయమన్నారు. అవసరమైతే పాఠశాలకు నిశ్చల్ ఆధ్వర్యంలో ఫౌండషన్ తరపున ఇద్దరు ఉపాధ్యాయు లను ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామన్నారు. నిశ్చల్ ఫౌండేషన్ అధినేత నిశ్చల్ నారాయణ్ మాట్లాడుతూ చదువులో ఏకాగ్రతను కోల్పోకూడదన్నారు. విద్యార్థులకు నిశ్చల్ నారాయణ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అందించే ఈ మెటీరియల్స్, ల్యాబ్స్ విద్యార్థులకు వారి భవిష్యత్కు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. అనంతరం విద్యార్ధులకు నిశ్చల్ పౌండషన్ వారు పుస్తకాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో టిటిడి మాజీ బోర్డ్ మెంబర్ నాగేశ్వరరావు, ఆర్టిసి నంద్యాల జిల్లా ఆర్ఎం శ్రీనివాసులు, బిల్డర్, కాంట్రాక్టర్ ఏపి, తెలంగాణ నరెద్దుల శ్రీనివాస రెడ్డి, పిఆర్డిఈ ఈదుల నాగిరెడ్డి, నందికొట్కూరు మున్సిపల్ చైర్మన్ దాసి సుధాకర్ రెడ్డి, తర్తుర్ సర్పంచ్ నాగిరెడ్డి, గ్రామ పెద్ద లు ఈదుల నారాయణ రెడ్డి, యోగేశ్వర రెడ్డి, వైకాపా నాయకులు హేమశేఖర్ రెడ్డి, దేవ సహాయం, తదితరులు పాల్గొన్నారు.










