Nov 09,2023 21:28

జిల్లా అధికారులు నివేదికిచ్చినా స్పందించని ప్రభుత్వం
ప్రాథమిక అంచనాలో 12 వేల ఎకరాల్లో పంటలకు దెబ్బ
కరువు తీవ్రత పెరిగే అవకాశం ఉందని లెక్కలు
ఎంపీ, ఎంఎల్‌ఎలే నష్టం గుర్తించినా స్పందించని ప్రభుత్వం
కరువు మండలాలను ప్రకటించే ఉద్దేశం లేదా అంటూ ప్రశ్నిస్తున్న రైతులు
ప్రజాశక్తి - ఏలూరు ప్రతినిధి

వర్భాభావంతో పంటలు ఎండిపోయి రైతులు తీవ్రంగా దెబ్బతిన్నప్పటికీ కరువు మండలాల ప్రకటనలో ప్రభుత్వం మొద్దునిద్ర నటిస్తోంది. జిల్లాలో దెబ్బతిన్న పంటలకు సంబంధించిన లెక్కలు, ప్రస్తుత పరిస్థితిని జిల్లా అధికారులు ప్రభుత్వానికి నివేధించినప్పటికీ, దెబ్బతిన్న పంటలను, ఎంపీ, ఎంఎల్‌ఎలు పరిశీలించినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. కరువు మండలాలను ప్రకటించి రైతులను ఆదుకునే ఉద్దేశం ప్రభుత్వానికి ఉందా లేదా అంటూ అన్నదాత ప్రశ్నిస్తున్నాడు. ఈ ఏడాది తీవ్ర వర్షాభావ పరిస్థితులేర్పడ్డాయి. జూలై నెల మినహా జూన్‌, ఆగస్టు, సెప్టెంబర్‌ నెలల్లో తీవ్ర వర్షపాతం లోటు ఏర్పడింది. దీంతో చింతలపూడి, కామవరపుకోట, చాట్రాయి, బుట్టాయగూడెం వంటి మండలాల్లో భూగర్భ జలాలు తగ్గిపోయి బోర్ల నుంచి నీరు రావడంలేదు. చెరువులు అడుగంటాయి. ఫలితంగా ఎక్కడికక్కడే పంటలు నిలువునా ఎండిపోతున్నాయి. ఇప్పటివరకూ వ్యవసాయాధి కారులు ప్రాథమిక లెక్కల ప్రకారం జిల్లాలో 12,017 ఎకరాల్లో వరి, మినుము, పత్తి, చెరకు వంటి పంటలు వర్షాభావ పరిస్థితులతో ఎండిపోతున్నాయని 3,864 ఎకరాల్లో పంటలు ఎండిపోయాయని, ఇదే పరిస్థితి కొనసాగితే 4,203 ఎకరాల్లో పంటలు దెబ్బతింటాయని నివేదికను తయారు చేసి ప్రభుత్వానికి పంపారు. ఇవి ప్రాథమిక అంచనాలు మాత్రమే. దెబ్బతిన్న పంటల విస్తీర్ణం మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు క్షేత్రస్థాయిలో పరిస్థితులు అద్ధంపడుతున్నాయి. దెబ్బతిన్న పంటలు పశువుల మేతగా మారిపోయాయి. ఎకరాకు రూ.20 వేలకు పైగా పెట్టుబడి పెట్టిన రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తీవ్రంగా నష్టపోయామని ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. దెబ్బతిన్న పంటల పరిశీలనకు ప్రజాప్రతినిధులు రాకపోవడంపై తీవ్ర విమర్శలు రావడంతో ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్‌, చింతలపూడి ఎంఎల్‌ఎ ఎలిజా క్షేత్రస్థాయికి వెళ్లి దెబ్బతిన్న పంటలను పరిశీలించి రైతులతో మాట్లాడారు. రైతులను అన్నివిధాలా అదుకుంటా మంటూ భరోసా ఇచ్చారు. కానీ కనీసం కరువు మండలాలుగా ప్రకటించకుండా రైతులను ఏవిధంగా ఆదుకుంటారో తెలియడం లేదు. అధికారులు నివేదిక ఇచ్చినా, ప్రజాప్రతినిధులు స్వయంగా దెబ్బతిన్న పంటలను పరిశీలించినా ప్రభుత్వం ఎందుకు స్పందిం చడం లేదో అర్ధంకావడం లేదు. తమది రైతు ప్రభుత్వ మంటూ గొప్పలు చెప్పడం తప్ప కష్టంలో ఉన్న అన్నదాతను ఆదుకునే పరిస్థితి లేకుండా పోయింది. పంటను కోల్పోయిన రైతులను ఆదుకోకపోతే రబీ పంట సాగుచేయలేని పరిస్థితి ఏర్పడింది. వ్యవసాయ కార్మికులకు ఉపాధి లేకుండా పోయింది. ఇంత దుర్భర పరిస్థితులు నెలకొన్నా కరువు మండలాల ప్రకటనపై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
కరువును గుర్తించకపోవడం దారుణం
కె.శ్రీనివాస్‌, ఎపి రైతుసంఘం జిల్లా కార్యదర్శి
కొన్ని మండలాల్లో కరువు సమస్య తీవ్రంగా ఉన్నా ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోకపోవడం అత్యంత దారుణం. కరువు మరింత తీవ్రమవుతోంది. చాట్రాయి, చింతలపూడి, కామవరపుకోట, బుట్టాయగూడెంతోపాటు కరువు నెలకొన్న మండలాలను వెంటనే ప్రకటించాలి. పంటల బీమా పరిహారం అందించాలి. పశువుల మేత, కరువు సహాయక చర్యలు చేపట్టాలి. ఉపాధి కల్పించి ఆదుకోవాలి. ప్రభుత్వం స్పందించకపోతే రైతులతో కలిసి ఆందోళనలు ఉధృతం చేస్తాం.