క్రీడలతో భవితకు బాటలు
- స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ రాష్ట్రస్థాయి క్రీడాపోటీలను ప్రారంభించిన ఎంఎల్ఎ విక్రమ్రెడ్డి
ప్రజాశక్తి-ఆత్మకూరు అర్బన్ : నెల్లూరు జిల్లాలో నిర్వహించే రాష్ట్రస్థాయి క్రీడాపోటీలకు వేదికగా ఆత్మకూరు నిలవడం ఎంతో గర్వంగా ఉందని, గ్రామీణ ప్రాంత ప్రతిభ గల క్రీడాకారులు రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్నారని, విద్యార్థినులు క్రీడల్లో అత్యుత్తంగా రాణించాలని ఆకాంక్షిస్తున్నట్లు ఎంఎల్ఎ మేకపాటి విక్రమ్ రెడ్డి అన్నారు. పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల క్రీడామైదానంలో శనివారం 67వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ రాష్ట్రస్థాయి అండర్ -14, -16, -19 బాల్బ్యాడ్మింటన్ పోటీల ప్రారంభోత్సవానికి ఎంఎల్ఎ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జాతీయ పతాకావిష్కరణ చేసి క్రీడాపోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంఎల్ఎ మేకపాటి విక్రమ్రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో చదువులతో పాటు క్రీడల్లో కూడా విద్యార్థినులు అత్యుత్తమంగా రాణిస్తున్నారని, తన కుమార్తెలు సైతం క్రీడాకారిణులుగా రాణిస్తున్నారని తెలిపారు. బాస్కెట్ బాల్లో దేశం తరపున తనకుమార్తె ఆడుతున్నారనే విషయాన్ని విద్యార్థినులతో పంచుకుని వారిని ప్రోత్సహించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చదువులతో పాటు క్రీడాభివృద్ధికి కోసం కూడా కృషి చేస్తన్నారని, వచ్చే నెలలో ఆడుదాం ఆంధ్రా అనే కార్యక్రమం ద్వారా 46 రోజుల పాటు క్రీడాపోటిలను నిర్వహించి యువతలో క్రీడల వైపు రాణించేలా దృష్టి సారిస్తున్నారన్నారు. పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో మరిన్ని రాష్ట్రస్థాయి క్రీడాపోటీలు నిర్వహించేలా నిర్వాహకులు చూడాలని, ముఖ్యంగా గ్రామీణ ప్రాంత క్రీడాకారులు రాణించే కబడ్డీ పోటీలు ఇక్కడ నిర్వహించాలని సూచించారు. ఈ సందర్భంగా క్రీడాకారులను ప్రోత్సహించేందుకు స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ పోటిలలో అండర్ -14, -16, -19లలో విజయం సాధించిన జట్లకు రూ.లక్ష వంతున నగదు బహుమతిని అందజేస్తానని ఎంఎల్ఎ ప్రకటించడంతో పీడీలు, విద్యార్థినులు హర్షం వ్యక్తం చేశారు. అనంతరం రాష్ట్ర నలుమూలల నుండి బాల్ బ్యాడ్మింటన్ పోటీలకు హాజరైన జట్ల క్రీడాకారిణులను జిల్లాల వారీగా ఎంఎల్ఎ మేకపాటి పరిచయం చేసుకుని క్రీడల్లో అత్యుత్తమంగా రాణించాలంటూ ఆల్ ది బెస్ట్ తెలిపారు. ఎంఎల్ఎ స్వయంగా బాల్ బ్యాడ్మింటన్ ఆడి క్రీడాకారులను ప్రోత్సహించారు. ఎంపిపి కేత వేణుగోపాల్ రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ వెంకట రమణమ్మ, వైస్ చైర్మన్లు షేక్ సర్దార్, డాక్టర్ కెవి శ్రావణ్ కుమార్, జెసిఎస్ కన్వీనర్ వల్లభనేని రాజేంద్ర, ఐవి రమణారెడ్డి, కౌన్సిలర్లు చెరుకూరు, కామాక్షయ్య నాయుడు, కొప్పోలు రమాదేవి, వైసిపి నాయకులు జమీర్, చిన్నపరెడ్డి, ముజ్జు, అనంతలక్ష్మి, గేమ్స్ ఆర్గనైజర్ తిరుపతయ్య, తదితరులు పాల్గొన్నారు.










