ప్రజాశక్తి- దేవనకొండ
మండలంలోని కొత్తపేట గ్రామ మట్టి రహదారిపై బిటి రోడ్డు నిర్మాణం చేపట్టాలని జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జీ తెర్నేకల్ వెంకప్ప డిమాండ్ చేశారు. శుక్రవారం ఆ గ్రామ రహదారి స్టేజి వద్ద జనసేన పార్టీ ఆధ్వర్యంలో గ్రామస్తులు, జనసేన కార్యకర్తలతో కలిసి బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్ర ఉపాధి, కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరామ్ గత మూడేళ్ల క్రితం రోడ్డు నిర్మాణం చేపడతామని భూమి పూజ చేసి గాలికి వదిలేశారని తెలిపారు. గుంతలమయమైన ఈ రహదారిపై ప్రయాణం చేసే బడిపిల్లలు, గర్భిణులు, బాలింతలు, ద్విచక్ర వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. వెంటనే రోడ్డు పనులు మొదలు పెట్టాలని ప్రభుత్వన్ని డిమాండ్ చేశారు. జనసేన నాయకులు మగ్బుల్, బడేసాబ్, నందు, వీరేష్, మురళీ, కృప, సంజు పాల్గొన్నారు.
రోడ్డుపై బైఠాయించిన జనసేన ఇన్ఛార్జీ వెంకప్ప, గ్రామస్తులు










