కొండలరావును అరెస్టు చేయాలి
- సిఐటియు, అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ డిమాండ్
- జిల్లా వ్యాప్తంగా తహశీల్దార్ కార్యాలయాల ఎదుట నిరసన
ప్రజాశక్తి - నంద్యాల రూరల్
ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం రాయవరం గ్రామంలో అంగన్వాడీ కార్యకర్త హనుమాయమ్మను అతి కిరాతకంగా ట్రాక్టర్తో తొక్కించి హత్య చేసిన వైసిపి నాయకుడు కొండలరావును అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని ఎపి అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి నిర్మల, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ.నాగరాజు, జిల్లా ఉపాధ్యక్షులు తోటమద్దులు, పట్టణ అధ్యక్ష కార్యదర్శులు లక్ష్మణ్, కె.మహమ్మద్ గౌస్లు డిమాండ్ చేశారు. బుధవారం నంద్యాల తహశీల్దార్ కార్యాలయం ఎదుట ఎపి అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నంద్యాల అర్బన్ ప్రాజెక్ట్ కార్యదర్శి సునీత అధ్యక్షతన ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంగన్వాడీ కార్యకర్తలపై అనవసరంగా రాజకీయరంగు పులిమి వేధించడం ఈ మధ్యకాలంలో అధికమైందని అన్నారు. అంగన్వాడీ కార్యకర్త హనుమాయమ్మ కుటుంబం గత ఎలక్షన్లలో వైసిపికి మద్దతు ఇవ్వలేదని దురుద్దేశంతో వైసిపి నాయకుడు సవలం కొండలరావు ట్రాక్టర్తో తొక్కించి అత్యంత దారుణంగా హత్య చేయడం దుర్మార్గమన్నారు. కొండలరావును వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలన్నారు. హనుమాయమ్మ కుటుంబానికి రూ.50 లక్షలు ఎక్స్గ్రేషియా చెల్లించి, ఆ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో సిఐటియు ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన ఉదృతం చేస్తామనిహెచ్చరించారు. అనంతరం డిప్యూటీ తహశీల్దార్ రమాదేవికి వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో అంగన్వాడీలు నాగరాణి, లలితమ్మ, నిర్మలమ్మ, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. బేతంచెర్ల : కొండలరావును అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని సిఐటియు జిల్లా నాయకులు వై.ఎల్లయ్య, అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు జి షేబారాణి డిమాండ్ చేశారు. బుధవారం స్థానిక తహశీల్దార్ కార్యాలయం ముందు ఎపి అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ మండల నాయకులు ఎన్కె.నాగలక్ష్మి, ఎస్.గుల్జార్ బి ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. జూనియర్ అసిస్టెంట్ అశోక్ నాయుడుకు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు రాజబాబు, అంగన్వాడీ కార్యకర్తలు లక్ష్మీదేవి, రమాదేవి, నారాయణమ్మ ,రాజేశ్వరి, సుబ్బలక్ష్మి, రామ తులసి, అరుణ, రమణమ్మ తదితరులు పాల్గొన్నారు. కొత్తపల్లి : అంగన్వాడీ కార్యకర్త హనుమాయమ్మను అతి కిరాతకంగా ట్రాక్టర్తో తొక్కించి హత్య చేసిన వైసిపి నాయకుడు కొండలరావును అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని ఎపి అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నాయకురాలు హరిత, నాగమణి, రాజమ్మలు డిమాండ్ చేశారు. బుధవారం కొత్తపల్లిలోని తహశీల్దార్ కార్యాలయం ముందు యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. డిప్యూటీ తహశీల్దార్ పెద్దన్న కు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో అంగన్వాడీలు మరియమ్మ, సునీత, పద్మావతి, లక్ష్మీదేవి, విజయమ్మ తదితరులు పాల్గొన్నారు. ఆత్మకూర్ : కొండలరావుని వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నాయకురాలు మంజుల, లక్ష్మిదేవి, పరిమళ డిమాండ్ చేశారు. స్థానిక తహశీల్దార్కు వినతి పత్రం అందజేశారు. అంగన్వాడీలు స్వప్న, శ్రావ్య, అనసూయ తదితరులు పాల్గొన్నారు. పాములపాడు : హనుమాయమ్మను చంపిన కొండలరావును కఠినంగా శిక్షించాలని బహుజన సమాజ్ పార్టీ నందికొట్కూరు అసెంబ్లీ ఇంచార్జ్ ఎల్ స్వాములు, మాల మహానాడు జిల్లా అధ్యక్షులు అబ్రహం డిమాండ్ చేశారు. పాములపాడులోని బిఆర్ అంబేద్కర్ సర్కిల్లో నిరసన వ్యక్తం చేశారు. రజక సంఘం మండల నాయకులు రామకృష్ణ, బహుజన సమాజ్ పార్టీ నాయకులు ఆగస్ట్, ఎర్రన్న, ఏసు తదితరులు పాల్గొన్నారు. గడివేముల : కొండలరావుని వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. గడివేముల తహశీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి డిప్యూటీ తాసిల్దార్ మాధవకి వినతి పత్రం అందజేశారు. అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్స్ పాల్గొన్నారు.










