
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్:
చిత్తూరు జిల్లాను కరువు కమ్మేస్తోంది.. ఈ ఏడాది ప్రధాన పంట అయిన వేరుశనగ కూడా చేతికందేలా లేదు.. పెట్టిన పెట్టుబడి రాక చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలీక రైతులు అల్లాడుతున్నారు.. నిలకడ లేదని టమోటా ధరలు, గిట్టుబాటు ధరలేని మామిడి రైతులు నిలువునా కష్టాల ఊబిలో మునిగిపోతున్నారు... జిల్ల్లాలోని రైతాంగం కరువు కోరల్లో చిక్కుకుని అల్లాడుతున్నా ప్రభుత్వం మాత్రం పట్టించుకోకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. రైతాంగాన్ని ఆదుకోవడానికి పథకాలు తెచ్చాము.. రైతు భరోసా కేంద్రాలు పెట్టామని గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వానికి రైతన్నలు కష్టాలు పట్టడం లేదు... పైగా జిల్లాలోని పలమనేరు, గంగవరం, రొంపిచెర్ల, రామకుప్పం మండలాలను మాత్రమే కరువు మండలాలుగా ప్రకటించి జిల్లాలోని మిగిలిన కరువు మండలాలకు అన్యాయం చేసింది.
చిత్తూరు జిల్లాలోని 31 మండలాల్లోని కేవలం నాలుగు మండలాల్లో మాత్రమే కరువు ఛాయలు కనిపించాయని, మిగిలిన పంటలు బాగున్నాయంటూ జాబితా సమర్పించడంపై జిల్లాలోని రైతులు సంఘాలు, వామపక్ష పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. రాయలసీమ జిల్లాలోని అన్ని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించి రైతాంగాన్ని అదుకొనే చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి.
జిల్లాలో రబీ, ఖరీఫ్ సాగు అంతంతమాత్రమే.. ఈ ఏడాది ఖరీఫ్ సాగు 50శాతం కంటే తక్కువే పంట చేతికి వస్తుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. కరువు అంచనా వేసిన సాంకేతిక నిపుణులు జిల్లాలోని 27 మండలాల్లో రైతాగం ఎలాంటి ఇబ్బంది లేదంటూ ఇచ్చిన నివేదిక జిల్లా రౌతాంగాన్ని విస్మయానికి గురి చేస్తోంది. క్షేత్రస్థాయిలో రైతాంగం ఎదుర్కొంటున్న పరిస్థితులను అధ్యయనం చేసి జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలని రైతు సంఘాలు కోరుతున్నాయి.
తగ్గిన సాగు విస్తీర్ణం
చిత్తూరు జిల్లా ప్రధానంగా ఖరీప్ సాగుపైనే ఆధారపడి ఉంది. ఖరీప్ సాగు విస్తీర్ణం అధికం గతేడాది ఖరీఫ్ సాగు 2.39లక్షల ఎకరాల్లో పంట సాగు ఉంటే 1.93.105 ఎకరాలు మాత్రమే పంటసాగు అందింది. ఈ ఏడాది 2.28 లక్షల ఎకరాల్లో ఖరీప్ సాగు ఉంటుందని వ్యవసాయ శాఖ అంచనా వేసినా 1.01.355 ఎకరాలే పంట సాగు కనిపించింది. ఈ ఖరీఫ్ సగానికి సంగం తగ్గిపోయింది. ప్రభుత్వం సబ్సిడీ విత్తన వేరుశనగ కాయలు పంపిణీ చేసిన జూన్, జూలై మాసాల్లో కురిసిన అడపాదడపా వర్షాలతో వేరుశనగ సాగుకు రైతులు ఉపక్రమించలేదు. ఫలితంగా జిల్లాలో వేరుశనగ విస్తీర్ణం తగ్గిపోయింది.
దిగుబడి అంతంతమాత్రమే...
అష్టకష్టాలు పడి వేరుశనగ పంట సాగు చేసినా రైతులకు దిగుబడి అంతంతమాత్రమే రావడంతో పెట్టుబడి సైతం రావడం లేదని వేరుశనగ రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఎకరాలకు 10 నుంచి 15 క్వాంటాళ్లు దిగుబడి రావాల్సి ఉండగా ఎక్కువ మంది వేరుశనగ రైతులకు 2 నుంచి 5 క్వింటాళ్లే చేతికందుతోంది. ఎకరాకు రూ.25వేలు పట్టుబడిపెడితే రూ.5 నుంచి 11వేలు మాత్రమే లాభం వస్తోందంటున్నారు. అధిక వర్షపాతంలో వేరుశనగ ఏపుగా పెరిగి పంట దిగుబడి తగ్గిందా అంటే అదీ లేదు. ఈ ఖరీఫ్ సీజన్లో ఎక్కడా అత్యధిక వర్షపాతం నమోదు కాలేదు. 10 మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదు అయ్యింది. 21 మండలాల్లో సాధారణ వర్షపాతం కంటే తక్కువ నమోదు అయ్యింది. వర్షభావ పరిస్థితులతో జిల్లాలో 1.27లక్షల ఎకరాలు బీడు భూములుగా దర్శనమిస్తున్నాయి.
ఈ పరిస్థితులకు అంచనా వేయకుండా జిల్లాలో కేవవలం నాలుగు మండలాలను మాత్రమే కరువు మండలాలుగా ప్రకటించడం పట్ల సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. కరువు మండలంగా ప్రకటించిన మండలానికి ఆ మండల పరిధిలో సాగురైతులకు పెట్టుబడి రాయితీ వస్తుంది. పంట రుణాలు రీషెడ్యూల్ అవుతాయి. పంట రుణాలపై వడ్డీ మాఫీ అవుతుంది. వ్యవసాయ కూలీలకు ఉపాధిహామీ పనులపై 50 పని దినాలు కల్పిస్తారు. రైతు సంక్షేమ ప్రభుత్వమని చెప్పుకుంటున్న జగన్ మోహ్మన్రెడ్డి ప్రభుత్వం కరువు మండలాల విషయంలో క్షేత్రస్థాయిలో రైతాంగం ఎదుర్కొంటున్న కష్టాలను దృష్టిలో ఉంచుకొని కరువు మండలాల సంఖ్యను పెంచి రైతాంగాన్ని అదుకోవాల్సిన అవసరముందని వామపక్ష రైతు సంఘాలు, రైతులు కోరుతున్నారు.