ప్రజాశక్తి పాడేరు : స్థానిక ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ డిగ్రీ కళాశాల, హుకుంపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో శనివారం పాడేరు డిగ్రీ కళాశాల, హుకుంపేట జూనియర్ కళాశాలలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పిలుపు మేరకు సేవ పక్వాడ కార్యక్రమంలో భాగంగా ఎన్ఎస్ఎస్ దినోత్సవం పురస్కరించుకొని రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రెడ్ క్రాస్ సభ్యులు మాట్లాడుతూ, జిల్లా కలెక్టర్, ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి ఆదేశాల మేరకు స్వచ్ఛందంగా రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. రక్తదానం చేసేందుకు యువకులు, ఉత్సాహవంతులు ముందుకు రావాలని కోరారు. జిల్లా కేంద్రంలో రక్త నిలువలను పెంచేందుకు బ్లడ్ బ్యాంక్ నిర్వహణకు జిల్లా కలెక్టర్, ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి తీవ్రంగా కృషి చేస్తున్నారని తెలిపారు. అంతకముందు రక్తదాన శిబిరాన్ని డిగ్రీ కళాశాలలో కళాశాల ప్రధాన చార్యులు వనుము చిట్టబ్బాయి, హుకుంపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రధాన చార్యులు కొట్టగుల్లి సింహాచలం నాయుడు ప్రారంభించారు. పాడేరు డిగ్రీ కళాశాలలో సిబ్బంది విద్యార్థులు 19 మంది రక్తదానం చేశారు. హుకుంపేట ప్రభుత్వ కళాశాలలో నిర్వహించిన రక్తదాన శిబిరంలో ఎన్ఎస్ఎస్ కళాశాల సిబ్బంది, బీజేవై నాయకులు 11మంది రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రూపకళ, వైజాగ్ డాక్టర్ బివివి ప్రసాద్, జిల్లా కోఆర్డినేటర్ లోహితస్, స్థానిక సభ్యులు సూర్యారావు, జయలక్ష్మి, గౌరీ శంకర్, బ్లడ్ బ్యాంక్ పాడేరు- విశాఖపట్నం రెడ్ క్రాస్, కళాశాలల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.










