కార్మికులను రెగ్యులర్ చేయాలి
- సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు తోట మద్దులు
- మున్సిపల్ కార్యాలయం కార్మికులు ధర్నా
ప్రజాశక్తి - నంద్యాల
రాష్ట్రవ్యాప్తంగా మున్సిపాలిటీలలో పని చేస్తున్న కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని, పిఎఫ్, ఈఎస్ఐ, రిటైర్మెంట్ బెనిఫిట్ సౌకర్యాలను, సంక్షేమ పథకాలు వర్తింపచేయాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు తోట మద్దులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం నంద్యాల మున్సిపల్ కార్యాలయం ఎదుట మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ కార్మికులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగంలో పని చేస్తున్న కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని, మున్సిపాలిటీలలో పని చేసే కార్మికులకు జిఒ 7 ప్రకారం స్కిల్డ్, సెమీ స్కిల్డ్ వేతనాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. అర్హులైన వారందరికీ స్థలాలు ఇచ్చి ఇల్లు నిర్మించి ఇవ్వాలన్నారు. నంద్యాల మున్సిపాలిటీ నుండి తొలగించిన 44 మంది కార్మికులకు హైకోర్టు తీర్పు ప్రకారం 18 నెలల వేతనాలు చెల్లించాలని, ఇటీవల ఆకస్మికంగా చనిపోయిన మున్సిపల్ కార్మికుడు తులసీరామ్ మధు కుటుంబాన్ని ఆదుకోవాలని, ఆ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని కోరారు. అనంతరం మున్సిపల్ ఇంజనీర్ రమణమూర్తికి సమస్యలతో కూడిన వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు పట్టణ కార్యదర్శి మహమ్మద్ గౌస్, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ కార్యదర్శి భాస్కరాచారి, నాయకులు ఆదాము, నాగేశ్వరరావు, పవన్, ఆంజనేయులు, మున్సిపల్ కార్మికులు పాల్గొన్నారు. ఆత్మకూర్ : సిఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మున్సిపల్ ఉద్యోగులు, కార్మికులను, కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ సిబ్బందిని పర్మినెంట్ చేస్తానని చెప్పి ఇప్పుడు మాట మారుస్తున్నారని సిఐటియు పట్టణ ఉపాధ్యక్షులు రణధీర్, ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ నాయ కులు నాగన్న, గొడుగు రాజు, జోషఫ్లు అన్నారు. మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని మున్సిపల్ మేనేజర్కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు ఎన్ స్వాములు, మున్సిపల్ కార్మికులు ప్రసాద్, దానం,నాగరాజు,రాజేష్, రూతమ్మ, రవి పాల్గొన్నారు. డోన్: మున్సిపల్ కార్మికులను పర్మినెంట్ చేయాలని, వారి సమస్యలను వెంటనే పరిష్కరించాలని సిఐటియు పట్టణ కార్యదర్శి టి.శివరాం, మండల అధ్యక్షులు పి. రామాంజనేయులు, మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి కుల్లాయప్ప ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్థానిక మున్సిపల్ కార్యాలయం దగ్గర యూనియన్ ఉపాధ్యక్షులు పెద్ద ఎల్లయ్య అధ్యక్షతన ధర్నా నిర్వహించారు. అనంతరం ఆర్వో మధుకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు దేవదానం, బలరాముడు, ఆవులయ్య, సుంకన్న, ఏసు, అంజనమ్మ, లక్ష్మీశ్వరి, వెంకటలక్ష్మి, మాదమ్మ తదితరులు పాల్గొన్నారు.










