ప్రజాశక్తి ధర్మవరం టౌన్ : జగన్ తన పాదయాత్రలో మున్సిపల్ కార్మికులకు అనేక హామీలిచ్చారని, తీరా అధికారంలోకి వచ్చాక ఆ హామీలన్నీ నెరవేర్చడంలో విఫలం చెందారని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఓబులు విమర్శించారు. తమ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర వ్యాప్తంగా సిఐటియు ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులు చేపట్టిన రిలే నిరాహారదీక్ష శుక్రవారానికి రెండోరోజుకు చేరుకున్నారు. రెండవ రోజు స్థానిక మున్సిపల్ కార్యాలయం ఎదుట దీక్షను నిర్వహించారు. ఈ దీక్షలకు సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఓబులు, చేనేత కార్మికసంఘం రాష్ట్ర అధ్యక్షులు పోలా రామాంజినేయులు, ఉమ్మడిజిల్లాల శ్రామిక మహిళా కన్వీనర్ దిల్షాద్, సిఐటియు మండల కార్యదర్శి అయూబ్ తదితరులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఓబులు మాట్లాడుతూ ఎన్నికలకు ముందు మున్సిపల్ ఉద్యోగులకు, కార్మికులకు అనేక హామీలు ఇచ్చిన జగన్ హామీలు ప్రస్తుతం ఏమయ్యాయని ప్రశ్నించారు. ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చిన జగన్ అందరినీ నిలువునా మోసం చేశారని విమర్శించారు. మున్సిపల్ స్కూళ్లను విద్యాశాఖలోకలిపి 2వేల మంది స్వీపర్లను ఇంటికి పంపారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల అధ్యక్షులు ఎల్ ఆదినారాయణ, డివైఎఫ్వై నాయకులు బాలాజీ, షెక్షావలి, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ అధ్యక్ష, కార్యదర్శులు బాబు, చెన్నకేశవులు, గౌరవాధ్యక్షులు పుల్లన్న, సభ్యులు ప్రసాద్,నరసమ్మ, వెంకటేశ్, పెద్దక్క తదితరులు పాల్గొన్నారు.
కదిరి టౌన్ : మున్సిపల్ కాంట్రాక్ట్ పారిశుధ్య కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు నరసింహులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మున్సిపల్ పారిశుద్ధ కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ శుక్రవారం కదిరి పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద మున్సిపల్ వర్కర్స్, ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో కార్మికులు దీక్షలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ యూనియన్ నాయకులు తిరుపాలు, జనార్ధన, బాలకృష్ణ, రాజు, నరసింహమూర్తి, సూరి, చిన్నకృష్ణ సిఐటియు నాయకులు జిఎల్. నరసింహులు, జగన్మోహన్, ముస్తాక్, ఫాజిల్ తదితరులు పాల్గొన్నారు.
పుట్టపర్తి అర్బన్ : తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మున్సిపల్ కార్మికులు మున్సిపల్ కార్యాలయం ముందు చేపట్టిన నిరసన శుక్రవారానికి రెండో రోజుకు చేరుకుంది. ఈ సందర్బంగా కార్మికులు కళ్లకు గంతలు కట్టుకొని మోకాళ్ళపై నిల్చొని నిరసన తెలిపారు. ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్న సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఇఎస్ వెంకటేష్ మాట్లాడుతూ మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారానికి ఈనెల 27న రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన మున్సిపాలిటీల ముట్టడిని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో మునిసిపల్ యూనియన్ నాయకులు నాగార్జున, రామయ్య, పెద్దన్న, రమణ, రమేష్, గణేష్, సత్యం, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
హిందూపురం : మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించే వరకు వారు చేసే పోరాటాలకు టిడిపి పూర్తి మద్దతు ఇస్తుందనిటిడిపి సీనియర్ నాయకులు నాగరాజు, పట్టణ అధ్యక్షులు రమేష్కుమార్, కౌన్సిలర్లు రాఘవేంద్ర, సతీష్కుమార్ అన్నారు. మున్సిపల్ ఉద్యోగ కార్మిక సంఘం, సిఐటియు ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు రెండవ రోజైన శుక్రవారం కొనసాగాయి. కార్మికులు చేస్తున్న ఆందోళనకు టిడిపి నాయకులు మద్దతు తెలిపారు. ఈ సందర్బంగా టిడిపి నాయకులు, సిఐటియు పట్ణ కార్యదర్శి నరసింహప్ప మాట్లాడుతు మున్సిపల్ కార్మికులందరినీ పర్మినెంట్ చేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ అధికారులు, పాలకవర్గం, ప్రభుత్వం స్పందించి మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కారం చేయకపోతే ఈనెల 27వ తేదీన మున్సిపల్ కార్యాలయాల ముట్టడి చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు మల్లికార్జున, కార్యదర్శి జగదీష్, కోశాధికార ఆనంద్, శివ, గుర్నాథ్, బాబయ్య, రమేష,్ కృష్ణమూర్తి, నారాయణ, కవిత, సుబ్బలమ్మ, శోభ, క్లాప్ వర్కర్స్ అనిల్, కిరణ్, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.










