Oct 30,2023 23:40

సభలో మాట్లాడుతున్న కలెక్టర్‌ హిమాన్షు శుక్లా

మంత్రి వేణు, కలెక్టర్‌ హిమాన్షు శుక్లా
ప్రజాశక్తి - రామచంద్రపురం
కాలుష్య రహిత భారతం నిర్మించేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కలెక్టర్‌ హిమాన్షు శుక్లా, మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ విజ్ఞప్తి చేశారు. కె.గంగవరం మండలం కుందూరు, రామచంద్రాపురం మండలంలోని బాపనయ్య చెరువు గ్రామాల్లో 'స్వచ్ఛత మన బాధ్యత' కార్యక్రమాలను సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్లాస్టిక్‌ వ్యర్ధాలతో ప్రమాదం పొంచి ఉందన్నారు. దేశంలో జనాభా కంటే ప్లాస్టిక్‌ అధికంగా ఉందని తెలిపారు. ప్లాస్టిక్‌ను వాడిన తరువాత ఇష్టాను సారంగా కాలువ గట్లు, పంట కాలువలు, డ్రెయినేజీల్లో పడేస్తున్నారన్నారు. ఫలితంగా పంట కాలువల నీరు కాలుష్యమవుతుందన్నారు. ఈ నీటిని వినియోగించి సాగుచేస్తున్న పంటల ఉత్పత్తుల్లోనూ ప్లాస్టిక్‌ తాలూకు రసాయనాలు ఉంటున్నాయన్నారు. వీటిని ఆహారంగా తీసుకోవడం వల్ల నానా రకాల వ్యాధుల బారిన పడుతున్నామని తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా ఎనిమిది వందల కోట్ల టన్నులు ప్లాస్టిక్‌ వ్యర్థాలు పేరుకుపోయాయన్నారు. గ్రామస్థాయి నుంచి ఎక్కడికి అక్కడ ప్లాస్టిక్‌ వాడకాన్ని నిరోధించాలని ఆయన సూచించారు. మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ స్వచ్ఛత మన బాధ్యత అనే కార్యక్రమం రామచంద్రపురంలో రూపొందించామన్నారు. ఈ కార్యక్రమం ఆవశ్యకతను వివరించారు. గ్రామాల పరిశుభ్రంగా ఉండటం వల్ల పలు వ్యాధులు ప్రబలకుండా ఉంటాయన్నారు. గ్రామాల్లో మొట్టమొదటి వైద్యుడు పారిశుధ్య కార్మికుడేనన్నారు. పారిశుధ్య కార్మికులను గౌరవించాలని ఈ సందర్భంగా మంత్రి సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి పంపన నాగమణి, జడ్‌పిటిసి సభ్యులు ఓబులనేని వరలక్ష్మి, వైసిపి నాయకులు పి.శ్రీనివాస్‌, సర్పంచ్‌ పంపన సత్యానందం, బత్తుల అప్పారావు, పంపన సుబ్బారావు, పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు ఎంపిటిసి సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.