Dec 20,2020 11:02

    ప్రైవేట్‌, కార్పొరేట్‌ విద్యాసంస్థల ఒత్తిడికి సర్కారు ఆన్లైన్‌ క్లాసులకు అనుమతి ఇచ్చింది. దాంతో క్లాసులు జోరుగా జరుగుతున్నాయి. పిల్లలు వింటున్నారా? వాళ్లకు అర్థమవుతుందా.. లేదా? వాళ్ల భవిష్యత్‌పై ఈ చదువులు ఎలాంటి ప్రభావం చూపుతాయి? అనేది ఎవ్వరికీ అవసరం లేదు.
    ఈ పరిస్థితుల్లో అరుణ్‌రాజ్‌ పరిస్థితి అయోమయంగా మారింది. చదివేది నాలుగో తరగతి. ఆ పిల్లవానికి మాత్రమే అర్థమయ్యే బాధ ఒక్కటే... టీచర్‌ విద్యార్థి బంధం తెగి, ఆట స్థలానికి దూరమయ్యాడు. ఆ బాధను భరించలేక ఉక్కిరి బిక్కిరి అవుతున్నాడు. ఏం చేయాలో అర్థం కాని అరుణ్‌కు తీక్షణంగా ఆలోచిస్తున్న తాత కనిపించాడు.
    'తాతా! ఏం చేస్తున్నవ్‌? నాకో కథ జెప్పవా?' అని అడిగాడు అరుణ్‌రాజ్‌.
    'ఏం కథ జెప్పను?' తిరిగి అడిగాడు తాత.
    'నీ ఇష్టం' అన్నాడు మనువడు.
  తనకు వచ్చే ఆలోచనల్ని అడ్డుకున్నందుకు కోపమొచ్చినా, తన కోపాన్ని మనువడిపై ప్రేమతో కథగా మార్చాడు తాత.
కథ మొదలయింది.........
'అనగనగా ఒక దేశమున్నది. అల్ల లెక్కలేనన్ని ఊళ్ళు. లెక్కబెట్టలేనంత జనం.
అట్లా ఒక ఊరిలో కొంరయ్య అనే రొండెకురాల సన్నకారు రైతుండేటోడు. ఎండినా పండినా గదే ఆదెరువు. గళ్లనే ఇగురంతో పంట దీసి బిడ్డ పెండ్లి కూడా ఎల్లదీసిండు. కొడుకును పైసల బల్లెసీ సదివిపిత్తాండు. ఉన్నదాంట్లో ఉన్నంతల మర్యాదగా బతికేటోడు.
    రోజులు మారినై. యవుసం మారింది. సర్కార్‌ కూడా రైతులకు అది జెత్తం, ఇది జెత్తం అని గద్దెనెక్కింది. గాని చేసేదేం లేదు. అందరిగ్గూడ ''రైతు'' అనే పదమినంగానే ఎక్కడ లేని భక్తి, పూనకం అత్తది. రైతుకు ఆపదంటే మాత్రం భక్తి అంతా భస్మమైపోద్ది. ఇంకా ''రైతే రాజు'' ''దేశానికి ఎన్నెముక'' అనుడు. పేరు గొప్ప, వూరి దిబ్బ అన్నట్టు మారిపోయింది. సర్కార్తో గలిసి ప్రయేటోడు, కార్పోరేటోడు యవుసాన్ని ఆగమాగం జేసిండు.
గసొంటి రోజుల్లో సర్కారీ సాయం సాలక కొంరయ్య ఎప్పటి లెక్కనే అడ్తిదారు దగ్గర పంట పెట్టుబడికి అప్పు దెచ్చిండు. నాగళ్లతో దున్నిచ్చిండు. పుల్లెరిపిచ్చిండు. గడ్డి మందు కొట్టిండు. కిందా మీద బడి పంటేసిండు. ఇగ సూడాలే. మందుల మీద మందులు కొట్టుడే కొట్టుడు. పైసలన్నీ గుడాల లెక్క ఐపోతానై. కొంరయ్య గాశారం అధ్వాన్నమైంది. వరదలొచ్చి సగం పంటను బురద పాల్జేసినై. మిగిలిన సగాన్ని కోసి తుర్పారం బట్టిండు. ఈసారి తిండిగ్గుడా అయ్యేటట్టు లేవని దిగులుతోనే బస్తాలు నింపిండు.
  పంటను అమ్మాలిగా. పట్నం పోదమనుకొని, బస్తాలన్నీ టాక్టర్‌ ఎక్కిచ్చిండు. వూరి పొలిమేర దాటంగనే షావుకారు అడ్డమొచ్చిండు.
''ఏం కొంరయ్య ఎరువుల పైసలు ఏమాయే?'' అన్నడు.
''మార్కెట్టుకు పోతానా అచ్చినంక నీకే మోదాలిత్తగానీ జర జరుగు షావుకారు'' అని బతుమలాడిండు. ఎటు పోతడు మల్లారాడా అనుకోని అడ్డుతొలిగిండు. షావుకారు. టాక్టర్‌ పట్నం బాట పట్టింది. ''ధర ఎక్కువొచ్చేకాడ పంటనమ్మితే అప్పులన్నీ దీరుతాయి. సట్టమే అచ్చింది కదా!'' అని మనసుల అనుకుంటా టాక్టర్‌ వేగంతో పాటే ఆలోసిస్తున్నడు కొంరయ్య. ఫోన్‌ రింగుతో తేరుకున్నడు. అడ్తిదారు ఫోన్‌ జేసిండు. ''కొంరయ్య ఏడి దాకా అచ్చింది బండి?'' అన్నడు.
గుండె కలుక్కుమన్నది కొంరయ్యకు.
''అన్నా పంటనీసారి పైసలు ఎక్కువచ్చే కాడ అమ్ముదం అనుకుంటానా'' అన్నడు కొంరయ్య.
    ''నా అప్పు తీరిసినంక ఎక్కడన్న అమ్ముకో! నా కైతే బండి పది నిమిషాల్లో మార్కెట్‌లో ఉండాల'' అని అరిచిండు.
    పేదోని కలలు ఇట్లాగే క్షణాల్లో అవిరైపోతారు. చేసేదేంలేక కొంరయ్య మార్కెట్‌కే బండి పోనిచ్చిండు. ఇన్ని రోజులు రికాము లేకుండా చేసిన కష్టానికి ఫలితం గట్టబోతున్నరు. హమాలోళ్లు బత్తాలు దించిండ్రు. ఖాంటా అయింది. అడ్తిదారు పైసలు లెక్క కడుతాండు. దానికింతా దీనికింతా అని. కొంరయ్య ఊసురెళ్లిపోతున్నది. అంతా పొంగ కొంతే సేతికొచ్చింది. అడ్తిదారు చివరికి ఒకమాట అన్నడు ''కొంరయ్య సర్కారు తెచ్చిన సట్టం నా అసొంటోనికి, నాకంటే ఎక్కువ పైసలున్న ప్రయివేటోనికి, కార్పోరేటోనికి అక్కెరకత్తది. నీ అసొంటోనికి గ్గాదు. ఎరుకయిందా? నువ్వూ అటు ఇటు అని తిరిగితే మాత్రం ఇది గూడా ఉండదు. ఈ పైసలు గూడా దక్కై యాదిలుంచుకో!'' అన్నడు.
       ''గింత తిప్పలబడి పండిత్తే మనిషికన్నా మర్యాదియ్యరు ఈ బాడ్కవులు!'' అని నోట్లో నోట్లో తిట్టుకుంటా ఆ దొంగ సర్కారు మాటను, అడ్తిదారు ఇచ్చిన కొంతను జేబుల వెట్టుకొని, తిరిగి ఊరికి బయల్దేరిండు.
      రాంగానే షావుకారు అడ్డమొచ్చే. జేబులున్న పైసలు దీసి, షావుకారు చేతుల బెట్టిండు. కొంరయ్యకు ఖాళీ సేతులు మిగిలిపోయే. ఒట్టిగా బోతే కూలోల్లు ఇజ్జత్‌ దీత్తరు. వేరే అదేరువు లేక షావుకారునే అప్పు అడిగిండు. షావుకారు మొదలు ఒప్పుకోలేదు. ''ఈసారి పంట దీస్కోని పట్నం దాకా పోను నీకే అప్పజెప్పుతా!'' అని కాయితం రాసియ్యమన్నడు. అట్లా రాస్కోని, అప్పు సేత బట్టుకొని కొంరయ్య ఇల్లు జేరిండు. పోయేటప్పుడు వుత్తగా పోలేదు పానమంతా గాబరా గాబరా ఐతందని, బ్రాండి షాప్‌కు పోయి ఇంత తాగి మరీ పోయిండు.
కార పాకిట్తో వచ్చిన తండ్రిని జూసిన కొడుకు, ఎదురొచ్చి ''అయ్యా.. బడి ఫీజు కట్టాలె. రేపు కట్టలేకపోతే బడికి రావొద్దన్నరు సార్లు!'' అన్నడు.
''సరే రేపు గడతాం తిరు'' అనుకుంటా లోపలికి పోయిండు కొంరయ్య.
  పైసలు లోపల బెట్టి బయటికచ్చి కాళ్ళు జేతులు కడుక్కొని, పెండ్లాన్ని బువ్వేరు అన్నడు. ఎంబడే ఆమె బువ్వేసి కొంరయ్య సేతికందించింది. ముద్ద నోట్లో వెట్టుకొంగనే ఎటు కదుల్తలేదు. రుచి పచి లేదు. కొంరయ్యకు ఎక్కడ లేని కోపమొచ్చింది. సర్రున లేసిండు. ఏ మగనికైనా పెండ్లామె అలుకగ దొరుకుద్ది కదా! వాళ్ళు మనుషులే అని ఎట్లా మర్శిపోతరో. పళ్లెం దీసి పెండ్లాం మీదికి ఇసిరిండు.
   ''ఇది కూరనానే, ఏడ నేర్సుకున్నవే అల్ల ఉల్లిగడ్డ లేదు, ఎల్లిగడ్డ లేదు. శారుల ఇంత సింతపండు లేదు. గా పోపు గింజలన్నా దొరుకలేదనే నీ యవ్వ'' అని బండబూతులు తిడుతండు.
''ఏం ఒర్రుతనవ్‌ ముండకొడుక... బువ్వంత భూమి పాల్జేత్తివి. నీకు రోగం తలుగా!'' అని మనసులో అనుకుంటా ''నేనేం జెయ్యాలే.. మనం అమ్మబోతేనో షావుకార్లు, మార్కెటోళ్లు కొసిరి కొసిరి కొంటరు. ఇప్పుడు రోజు తినే సరుకులు ఇష్టమున్నట్టు అమ్ముకొచ్చని సర్కారు సట్టం దెచ్చిందట. గందుకే ధరలు పెరిగినయట! సేతుల రూపాయి లేదు. ఉన్నదానితో అండిన'' అని ఏడ్సుకుంటా చెప్పింది భార్య.
    కారణం అదే గనుక కొంరయ్య కుయ్యిమనలేదు. సట్టం అనంగానే కొంరయ్యకు తాగింది సగం దిగింది. పెండ్లాం దగ్గర తప్పయిందని ఒప్పుకునే ధైర్యం లేక పడేసిన బువ్వ పళ్లెం తెచ్చుకొని తిన్నడు.
రోజులు గడిసిపాయే. కొంరయ్యకు ఏం దోత్తలేదు. తండ్లాటొక్కటే మిగిలింది. రంది బోయి కూసున్నడు.
''కొంరయ్య గీడెం జెత్తానవ్‌ చొరస్తా కాడ ఏదో మీటింగ్‌ వెట్టిండ్లాట. ఎమన్నా అక్కేరైతది కావచ్చు పోదాం రారాదు అన్నడు'' రామయ్య.
చేసేదేంలేక అచేతనంగా కదిలిండు కొంరయ్య.
కార్పోరేటొళ్లు అచ్చిండ్లు..సేతులల్ల ఉన్న పేపర్లు సుపిచ్చుకుంటా.
''సర్కార్‌ సట్టం దెచ్చింది తెలుసుగదా..! మీ భూములు మాకు లీజుకియ్యండి. వాటికి తగ్గట్టు పైసలిత్తం'' అని జెప్పిర్రు.
    ఆ రాత్రి కొంరయ్యకు నిద్ర పడ్తలేదు. బాగా ఆలోసించిండు. ''ఇగ నేను ఈ భూమి జెయ్యలేను. పంట దియ్యలేను. ఈ కట్టాలు నేను బడలేను!'' అని ఇసారిచ్చుకున్నడు.
పెండ్లాంతో సెపితే భూమి ఇయ్యోద్దని ఒక్కటే బొబ్బ. మనిషి ఇంతకుముందు లెక్కలేడు. డీలా పడిపోయిండు. ఎట్లయ్యేది గట్లనే ఐతది అనుకున్నడు.
    తెల్లారింది.. ఆ రోజును తలుసుకుంటే దేశమే అమ్ముడు వోయినట్టు అనిపిత్తది.పెండ్లాం కాళ్ళ ఏళ్ళా బడ్డా ఇనకుండా తెల్లారి మీటింగ్‌ల కాయితల మీద సంతకం బెట్టిండు. ఐదేండ్ల దాకా ఆ భూమి కార్పొరేటొళ్లదేనని బాండు పేపర్‌ రాసుకున్నరు. పైసలు, కాయితాలతో కొంరయ్య ఇల్లు జేరిండు. అప్పులు సగం దీరిపోయినై.
కానీ ఉత్తగుంటే ఎట్లెత్తది కడుపుకు. పోరని సదువుకు కావాల్నాయే. పానం ఆగుతలేదు. కొన్ని దినాల్లోనే కొంరయ్య ఆయన భూమిలనే కూలీగా మారిపోయిండు. ఎద్దు లెక్క పని జెత్తాండు. దినాము పొలంల కార్పొరేటోడు ఎరువుల పేరుతో భూమిల ఇసం జల్లుతంటే సూడలేక భూమి ఎంత ఎడుత్తందో అని పుండుపై కారం జల్లితే ఎట్లా వుంటాదో గసొంటి బాధతో కొంరయ్య ఏడ్వాబట్టే. ''ఎంత పని ఐపోయెరా!'' అని లబోదిబో అంటున్నాడు.
ఏడు గడిసిపోయింది. ''నా భూమి నాకిరు!'' అని కార్పొరేటోళ్ళతో లొల్లి వెట్టుకున్నాడు. కార్పొరేటోడు బాండ్‌ కాయితం సూపెట్టి పోలీసోళ్లతో కొంరయ్యను తన్నిచ్చిండు. ఏం జేయాలో తోచక భూమి మొత్తానికి అమ్ముదం అనుకున్నాడు. వేరేటోడు ఎవ్వడు ముందుకు రాలే. అగ్గువ ధరకే కార్పొరేటోడు భూమిని కాజేసిండు. కొంరయ్య ఒట్టి చేతులతో నడి బజార్ల పడిపోయిండు. సుట్టూ భూమి అమ్మిన కాయితాలు పడున్నై. జేబుల పైసలున్నై. మనిషికి పానమే లేదు. పురుగుల మందు తాగి కొంరయ్య పానమిడిసిండు!'' అని కథ చెప్పడం ముగించి..
''ఇది మొదటిది కాదు. లచ్చల మంది రైతులు కుప్పలు కుప్పలుగా నీటి బుడగల్లెక్క నేల రాలుతుండ్లు. అచ్చం ఇట్లాగే. ఇయ్యే కారణాలతో. సర్కారు మాత్రం సప్పుడు జేత్తలేదు. మాట్లాడితే చేసిన తప్పు బయటవడ్తాదాయే!'' అంటూ మనవడి వంక చూశాడు.
      అరుణ్‌రాజ్‌ కథ వినుకుంటా నిద్రలోకి జారాడు. పిల్లవాడిని లేపి, మంచం మీద పడుకోబెట్టబోతే కళ్లల్లో కారిన మనువడి కన్నీటి చారికలపై తాత కన్నీళ్లు పడినై.
''ఇది నేను నా మనవడికోసం అప్పటికప్పుడే అల్లిన కథ.
ఇది జరిగిన కథ. జరుగుతున్న కథ. జరుగబోయే కథ.
    ఎదురింటి రైతు నిత్యావసర సరుకుల్లేక కూర కోసం గొడవపడటం.. తన ఇంటి రైతు పంటకు గిట్టుబాటు ధర రాక అప్పు తీర్చలేక షావుకారు దగ్గర కుదువబెట్టడం.. కార్పొరేట్‌ వాడి చేతుల భూములు కోల్పోయి, పక్కింటి రైతు చనిపోవడం.. కొంత ఊహను, అనుభవించిన కష్టాల్ని అల్లి చెప్పాను.
     సర్కారు తెచ్చిన రైతు వ్యతిరేక చట్టాలతో ఒకప్పుడు రైతు అనేటోడు ఉండేవాడు. దేశానికి అన్నం పెట్టేటోడు. ఎవరి సాయమందకున్నా నమ్ముకున్న వ్యవసాయం కోసం ఎన్నోసార్లు ప్రాణమిచ్చాడు. ఇప్పుడిక లేడు. భావితరానికి ప్రయోగశాలలో రైతును చూపించే రోజులు దగ్గరే ఉన్నాయి.
ఇది రైతు వ్యథను గుర్తు చేసే అందరి కథ. అన్నం తినే వారందరి కథ.
   ఉదయం కొత్తగా ఉంది. నాగలిఖాని ఎత్తుకొని నడిచే ఎద్దు కొమ్ముల సందు నుండి సూర్యుడు ఎర్రగా ఉదయించాడు. ఎడ్ల వెనుక తాతా మనువడు ఇద్దరూ నడుస్తున్నారు. తాత పొలానికీ కాదు. మనువడు బడికీ కాదు. ఢిల్లీ రైతు పోరుకు. జరుగబోయే కథను వ్యథలా కనపడ్డ ప్రతీ ఒక్కరికీ చెప్పుకుంట నడుస్తున్నరు. ఆకలి కడుపులని, చాతనైనోళ్ళని అందరినీ పిలుచుకుంటా.. అందరినీ కలుపుకుంటా.. నడుస్తున్నారు.
మధ్య మధ్యలో తాత మనువడు ఇద్దరూ ఒకటేసారి
''రైతుల ఐక్యత వర్ధిల్లాలి!''
''రైతు రాజ్యం జిందాబాద్‌!!''
''రైతు వ్యతిరేక చట్టాలు రద్దు చేయాలి!!!'' అంటున్నారు.

(ఈ నెల 23 రైతుల దినోత్సవం)

అమృతరాజ్‌
9505094032