Sep 22,2023 21:49

పార్వతీపురంలో బైక్‌ర్యాలీ నిర్వహిస్తున్న ఉపాధ్యాయులు

ప్రజాశక్తి - కలెక్టరేట్‌ : తాము అధికారంలోకి వస్తే వారం రోజుల్లో సిపిఎస్‌ రద్దు చేసి ఒపిఎస్‌ను తీసుకొస్తానని చెప్పిన ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఇప్పుడు జిపిఎస్‌ తీసుకురావడమంటే ఉద్యోగులను, ఉపాధ్యాయులను మోసగించడమేనని యుటిఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కెఎస్‌ఎస్‌ ప్రసాద్‌ విమర్శించారు. యుటిఎఫ్‌ స్వర్ణోత్సవ సంబరాల్లో భాగంగా రాష్ట్ర ప్రచార జాతా శుక్రవారం పార్వతీపురం చేరుకుంది. ఈ జాతానుద్దేశించి ప్రసాద్‌ మాట్లాడుతూ యుటిఎఫ్‌ ఆవిర్భవించి 50ఏళ్లలో ఉపాధ్యాయుల సంక్షేమానికి, ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణకు, ఉపాధ్యాయులను ఐక్యపర్చేందుకు ఎంతో కృషి చేసిందన్నారు. యుటిఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శులు బి.లక్ష్మీరాజా, ఎస్‌.మురళీమోహనరావు మాట్లాడుతూ యుటిఎఫ్‌ అధ్యయనం, అధ్యాపనం, సామాజిక స్పృహలతో పని చేస్తుందన్నారు. అందుకే ఉపాధ్యాయులంతా యుటిఎఫ్‌ను ఆదరిస్తున్నారని అన్నారు. ఈ జాతా ఈనెల 29వరకు జరుగుతుందని, అక్టోబరు 1న విజయవాడలో 10వేల మందితో స్వర్ణోత్సవ ప్రారంభ వేడుకలు జరుగుతాయని తెలిపారు. ఈ సభను జయప్రదం చేయాల్సిందిగా వారు కోరారు. ఈ జాతా పార్వతీపురంలో భాస్కర్‌ కాలేజ్‌ నుంచి బైక్‌ ర్యాలీతో ప్రారంభమై స్థానిక్‌ ఎంపిడిఒ కార్యాలయం వద్ద గల యుటిఎఫ్‌ పతాక ఆవిష్కరణతో ముగిసింది. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు టి.రమేష్‌, సహాధ్యక్షులు కె.విజయకుమార్‌, వి.జ్యోతి, ట్రెజరర్‌ కె.మురళి, జిల్లా కార్యదర్శులు, అధిక సంఖ్యలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
సీతంపేట : యుటిఎఫ్‌ స్వర్ణోత్సవాల సంబరాల్లో భాగంగా చేపట్టిన బైకు ర్యాలీ సీతంపేట చేరుకుంది. సిఐటియు కార్యాలయం ఆవరణలో సీనియర్‌ నాయకులు పి.పద్మశ్రీ యుటిఎఫ్‌ స్వర్ణోత్సవ సంబరాల లోగాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా యుటిఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కెఎస్‌ఎస్‌ ప్రసాద్‌ మాట్లాడుతూ ఈనెల 21 నుంచి అక్టోరబర్‌ 1 వరకూ బైక్‌ జాతా జరుగుతుందన్నారు. అనంతరం అక్టోబర్‌ 1న విజయవాడ సిద్ధార్థ ఇంజనీరింగ్‌ కాలేజీ మైదానంలో స్వర్ణోత్సవ వేడుకలు నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ సంబరాలకు ఉపాధ్యాయులంతా పెద్దఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో యుటిఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శులు లక్ష్మీరాజు, ఎస్‌.మురళీమోహనరావు, రాష్ట్ర కోశాధికారి రెడ్డి మోహనరావు, రాష్ట్ర కౌన్సిలర్‌ దండు ప్రకాష్‌, జిల్లా కార్యదర్శి కె.కష్ణారావు, మండల ప్రధాన కార్యదర్శి పి.కృష్ణారావు, మండల అధ్యక్షులు కె.సింహాచలం, గౌరవ అధ్యక్షులు పి.నారాయుడు, సీనియర్‌ నాయకులు ఎ.ప్రకాశం, బి.జయప్రకాష్‌, ఎ.రామారావు తదితరులు పాల్గొన్నారు