Aug 25,2023 19:50

ఎంపిపి రంగమ్మకు వినతిపత్రం అందజేస్తున్న పంచాయతీ కార్మికులు

ప్రజాశక్తి-ఆలూరు
ఎపి గ్రామ పంచాయతీ కార్మికుల జిఒ 142ను సక్రమంగా అమలు చేయాలని సిఐటియు నాయకులు కోరారు. శుక్రవారం సిఐటియు ఆధ్వర్యంలో పంచాయతీ, స్వచ్ఛభారత్‌ కార్మికులు మండల పరిషత్‌ కార్యాలయం ముందు నిరసన చేపట్టారు. ఎంపిపి రంగమ్మ, సీనియర్‌ అసిస్టెంట్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్బంగా సిఐటియు నాయకులు కెపి.నారాయణ స్వామి, షాకీర్‌ మాట్లాడారు. పంచాయతీ కార్మికులతో వెట్టిచాకిరి చేయించుకుంటూ చాలీచాలని వేతనాలతో కార్మికులు దుర్భర పరిస్థితిలో ఉన్నారని తెలిపారు. జిఒ 142ను అమలు చేసి రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌, పింఛను సౌకర్యం కల్పించాలని డిమాండ్‌ చేశారు. 2022 పిఆర్‌సిని అమలు చేసి 1993 నాటికి ఉన్న కార్మికులను రెగ్యులర్‌ చేయాలని కోరారు. స్వచ్ఛభారత్‌ కార్మికులకు 13 నెలల పెండింగ్‌ వేతనాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఎపి పంచాయతీ ఎంప్లాయీస్‌ అండ్‌ వర్కర్స్‌ యూనియన్‌ తాలూకా కార్యదర్శి ఎల్లప్ప, రాముడు, లక్ష్మేంద్ర పాల్గొన్నారు.