
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్: రైతు చేతిలో, వ్యవసాయ భూమిలో ధాన్యలక్ష్మీ ఉన్నదని, ముఖ్యమంత్రి 2023-24 సంవత్సరానికి గానూ డాక్టర్ వై.యస్.ఆర్ రైతు భరోసా - పి.ఎం కిసాన్ రెండవ విడత నగదును రైతులకు అందజేయడం చాలా సంతోషంగా ఉందని చిత్తూరు నగర మేయర్ అముద తెలిపారు. మంగళవారం రెండవ విడత ఆర్థిక సాయం నగదు జమ కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి పుట్టపర్తి నుండి లాంఛనంగా ప్రారంభించారు. జిల్లా సచివాలయం సమావేశపు మందిరం నుండి వర్చువల్గా ఈ కార్యక్రమానికి చిత్తూరు నగర మేయర్, జిల్లా జాయింట్ కలెక్టర్ పి.శ్రీనివాసులు, రాష్ట్ర విదేశీ వ్యవహారాల ప్రభుత్వ సలహాదారు జ్ఞానేంద్ర రెడ్డి, జడ్పీ వైస్ చైర్పర్సన్ రమ్య, పికెఎం ఉడా చైర్మన్ వెంకట్రెడ్డి యాదవ్, స్త్రీ శిశు సంక్షేమ శాఖ జోనల్ చైర్పర్సన్ శైలజారెడ్డి, వ్యవసాయ, ఉద్యాన, పట్టు పరిశ్రమల శాఖల అధికారులు మురళీకష్ణ, మధుసూదన్ రెడ్డి, శోభారాణి, జడ్పీ మహిళా స్థాయి సంఘ చైర్పర్సన్ భారతి, రైతులు పాల్గొన్నారు. మేయర్ అముద మాట్లాడుతూ.. రైతులు గతంలో వ్యవసాయం చేయడానికి ఎరువులు, విత్తనాలు, క్రిమిసంహారక మందులు కొనడానికి అవసరమైన నగదు లేక చాలా కష్టపడుతూ కుటుంబ పోషణ కూడా ఇబ్బందిగా మారేదని, ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అవసరమైన అన్ని రకాల సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నదని తెలిపారు. జెసి శ్రీనివాసులు మాట్లాడుతూ భూయజమానులు, కౌలు రైతులు, చిన్న, సన్నకారు రైతుల సంక్షేమాన్ని దష్టిలో పెట్టుకుని పంటకు పెట్టుబడి సాయం కోసం ప్రైవేట్ వడ్డీ వ్యాపారులను, బ్యాంకులను ఆశ్రయించే అవసరం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడి సాయం కింద రూ.13,500 లు మూడు విడతలలో అందిస్తున్నారన్నారు. రైతు భరోసా కేంద్రం ద్వారా అవసరమైన ఎరువులు, విత్తనాలను పంపిణీ చేయడం జరుగుతున్నదని తెలిపారు. జిల్లాలో ఈ పథకం ద్వారా 2023-24 సంవత్సరంలో మొదటి విడతగా 2,28,091 రూ.171 కోట్లు లబ్ధి పొందగా, రెండవ విడతగా 2,31,144 మంది రైతులు రూ.94.29 కోట్లు ఇప్పటి వరకు మొత్తం రూ.1,391 కోట్లు లబ్ధి చేకూర్చడం జరిగిందని తెలిపారు.