ప్రజాశక్తి-పాడేరు: జిల్లాకు 9,640 ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్ర పరికరాలు వచ్చాయని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు.. కలెక్టర్ కార్యాలయం సమావేశ మందిరంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో బుధవారం సమావేశం నిర్వహించారు. ఈవిఎంలను డిగ్రీ కాలేజి సమీపంలో కట్టుదిట్టమైన భద్రతతో గొడౌన్లో భద్రపరిచామన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 3700 బ్యాలెట్ యూనిట్లు, 2640 కంట్రోల్ యూనిట్లు, 3100 వివిపాట్లు వచ్చాయని చెప్పారు. అన్నింటిని క్షణ్ణంగా తనిఖీ చేసామని చెప్పారు. వీటిలో 36 సక్రమంగా పనిచేయ లేదన్నారు. ఈనెల 16వ తేదీన మరొక సారి పరిశీలిస్తామని, రాజకీయ పార్టీల నేతలు పాల్గొన వచ్చన్నారు. ఈవిఎం ఓటింగ్ యంత్రాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. జిల్లాలో ఉన్న మూడు నియోజక వర్గాల్లో 1021 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసామన్నారు. పాత పోలింగ్ కేంద్రాలు 1008 ఉన్నాయని కొత్తగా 13 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. 1021 పోలింగ్ కేంద్రాలలో 3,54,225 మంది పురుషుల ఓటర్లు, 3,80,213 మంది మహిళా ఓటర్లు, 34 మంది ట్రాన్స్ జెండర్ల ఓటర్లు ఉన్నారన్నారు. 40 వేల మంది శాశ్వతంగా వలస వెళ్లిన ఓటర్లు, 24 వేల మృతి చెందిన ఓటర్లను ఓటరు జాబితా నుండి తొలగించామని పేర్కొన్నారు. 27,737 ఫారం 6, 25,427 ఫారం 7,51,197 ఫారం 8లను సేకరించామని చెప్పారు. ఈ సమావేశంలో పాడేరు శాసన సభ్యురాలు కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి, డి.ఆర్.ఓ.పి. అంబేద్కర్, వివిధ పార్టీల నేతలు పాల్గొన్నారు.










