
ప్రజాశక్తి - ఆలమూరు : ప్రతి కుటుంబానికి ఆరోగ్య భద్రత కల్పించేలా జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య సేవలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని ఎంపీడీవో జాన్ లింకన్, డిప్యూటీ తాహసిల్దార్ జానకి రాఘవ అన్నారు. మండలంలోని మడికి ఎంపీపీ పాఠశాల ఆవరణలో జగనన్న సురక్ష వైద్య శిబిరం ఉప సర్పంచ్ పడమటి సుజాత అధ్యక్షతన నిర్వహించారు. ఈ వైద్య శిబిరంలో ముఖ్యఅతిథిగా ఏఎంసీ చైర్మన్ యనమదల నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చాలా మందికి తమ శరీరంలో ఏఏ రోగాలు ఉన్నాయో తెలియదని, రక్త పరీక్షలు చేస్తేనే కొన్ని రోగాలు బయటపడతాయని బీపీ, షుగర్ లాంటి దీర్ఘకాలిక వ్యాధులు ఈ కోవకు చెందినవన్నారు. ఈ వైద్య శిబిరం ద్వారా ప్రతి ఇంటికి వైద్య ఆరోగ్య సిబ్బంది వాలంటీర్లు నేరుగా వచ్చి రక్త పరీక్ష నిర్వహించడం ద్వారా వారికి ఏ రకాల జబ్బులు ఉన్నాయో తెలుసుకొని వెంటనే వారికి చికిత్సను ప్రారంభించి వారి ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు జగనన్న ఆరోగ్య సురక్ష దోహద పడుతుందన్నారు. ఈ వైద్య శిబిరంలో చొప్పెల్ల పీహెచ్సీ వైద్యురాలు సువర్చలాదేవి, మల్లికార్జున రావుతో పాటు గైనిక్, పీడియాట్రిక్స్, జనరల్ మెడిసిన్, ఇతర స్పెషాలిటీల నుంచి ఇద్దరు చొప్పున వైద్యులు తమ వైద్య సేవలను అందిస్తున్నారన్నారు. ఈ క్యాంపులో 14 రకాల వైద్య పరీక్షలతో పాటు 172 రకాల మందులను అందుబాటులో ఉంచి రోగులకు అందిస్తున్నట్లు తెలిపారు. స్థానిక నేతలు పడమటి రాంబాబు, మల్లిమొగ్గలు చిన్న మాట్లాడుతూ గత పరిపాలనలో ఏ ప్రభుత్వము ఈ స్థాయిలో నేరుగా వైద్య శిబిరాలను నిర్వహించలేదని, ప్రజలకు ఆర్థిక భారం తగ్గించేలా స్పెషలిస్టు వైద్య సేవలు గడప వద్దకే రావటం స్ఫూర్తిదాయకమన్నారు. అనంతరం ఐసిడిఎస్ ఆధ్వర్యంలో అంగన్వాడి కేంద్రాల ద్వారా గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు, చిన్నారులకు అందిస్తున్న పౌష్టికాహార స్టాల్ ను ఆయా అంగన్వాడి కార్యకర్తలు ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో పిహెచ్చి సూపర్వైజర్ శివప్రసాద్, కార్యదర్శి కె.మోక్షంజలి ఐసిడిఎస్ సూపర్వైజర్ వరలక్ష్మి, వీఆర్వోలు సూర్యప్రకాష్ రావు, జ్యోతి, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.