ప్రజాశక్తి. గాండ్లపెంట : ప్రజాసమస్యల సత్వర పరిష్కారానికి అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అరుణ్బాబు ఆదేశించారు. మండల పరిధిలోని సోమయాజులపల్లి గ్రామ సచివాలయంలో మంగళవారం నిర్వహించిన జగనన్న సురక్ష్ష కార్యక్రమంలో పాల్గొన్న ఆయన అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. గ్రామంలో ఏ ఒక్కరికి సంక్షేమ పథకాలు అందలేదని మాట వినిపించకూడదన్నారు. అర్హులైన వారందరికీ 100 శాతం సంక్షేమ ఫలాలు అందించాలని ఆదేశించారు. అనంతరం మండల పరిధిలోని కట్టారుపల్లి శ్రీయోగి వేమన సమాధిని కలెక్టర్ అరుణ్ బాబు సందర్శించారు. ఈసందర్భంగా కలెక్టర్కు ఆలయ కమిటీ సభ్యులు స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో కదిరి ఆర్డీవో రాఘవేంద్ర, తహశీల్దార్ హమీద్బాషా, ఎంపీడీవో యాదవేంద్ర, వీఆర్వో అమానుల్లాతో పాటు ఎంపిపి జగన్మోహన్, వైసిపి మండల కన్వీనర్ పోరెడ్డి చంద్రశేఖర్ రెడ్డితో పాటు నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.
అమరాపురం : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న సురక్ష పథకాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని పెనుగొండ సబ్ కలెక్టర్ కార్తీక్ పేర్కొన్నారు మండల కేంద్రంలోని గ్రామ సచివాలయ ప్రాంగణంలో నిర్వహించిన జగనన్న సురక్ష కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. దరఖాస్తు చేసుకున్న వారికి ధ్రువ పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో మునిస్వామి, తహశీల్దార్ దాసరి రమేష్, ఎంపీపీ ఈరన్న, జెడ్పీటీసీ సారక్క నరసింహమూర్తి తదితరులు పాల్గొన్నారు.










