ప్రజాశక్తి- పార్వతీపురం రూరల్ : ప్రజలకు మెరుగైన ఆరోగ్య సేవలందించడమే జగనన్న ఆరోగ్య సురక్ష లక్ష్యమని స్థానిక ఎమ్మెల్యే అలజంగి జోగారావు అన్నారు. మండలంలోని బందలుప్పి పిహెచ్సి పరిధిలో వెంకంపేటలో శుక్రవారం నిర్వహించిన జెఎఎస్ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని రకాల వైద్య సేవలు ప్రజలకు అందించి ప్రభుత్వం ఉచితంగా మందులు అందిస్తుందని, అవసరమైతే మెరుగైన వైద్య సేవల కోసం నాణ్యమైన ఆసుపత్రులకు రిఫరల్ సౌకర్యం కూడా ఉందని అన్నారు. కనుక ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం అంగన్వాడీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పౌష్టికాహారం స్టాల్స్ చూశారు. కార్యక్రమంలో తహశీల్దార్ శివన్నారాయణ, వైద్యాధికారులు డాక్టర్ భాస్కరరావు, సర్పంచ్ తీళ్ల కృష్ణారావు, మాధవ, ఎంపిపి మజ్జి శోభారాణి, వైస్ ఎంపిపిలు సిద్ధా జగన్నాధరావు, బంకురు రవికుమార్, నాయకులు బొమ్మి రమేష్, భీమవరపు కృష్ణమూర్తి, మడక విశ్వనాథం తదితరులు పాల్గొన్నారు.
పాచిపెంట : మండలంలోని కేసలి సచివాలయం వద్ద శుక్రవారం నిర్వహించిన జగనన్న సురక్ష కార్యక్రమంలో ఎంపిపి బి.ప్రమీల పాల్గొన్నారు. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. కార్యక్రమంలో సర్పంచ్ సత్తరపు నిర్మల, వైస్ ఎంపిపి కె.రవీంద్రనాథ్, టి.గౌరీశ్వరరావు, సింహాచలం, మర్రి ఉమ, ఎంపిటిసి సభ్యులు గౌరమ్మ, మీసాల మోహన్, వైద్యాధికారులు పాల్గొన్నారు.
సాలూరు రూరల్ : మండలంలోని నార్లవలసలో ఎంపిడిఒ గొల్లపల్లి పార్వతి ఆధ్వర్యంలో జరిగిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపిపి రెడ్డి సురేష్ మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని తమ సొంత గ్రామంలో ఈ కార్యక్రమాలు చేస్తుందని, వీటిని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో సర్పంచ్ రామన్న దొర, ఎంపిటిసి అనూష, వైద్యులు శివకుమార్, సచివాలయం, అంగన్వాడీ, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
పాలకొండ : మండలంలోని గోపాలపురంలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి (డిఐఒ) డాక్టర్ టి.జగన్మోహనరావు తనిఖీ చేశారు. ప్రతి కౌంటర్ వద్ద ప్రజలకు అందుతున్న వైద్య సేవలను పరిశీలించారు. ఇంటింటి ఆరోగ్య సర్వేలో ఎంతమందికి టోకెన్లు అందజేశారని, శిబిరం వద్ద కొత్తగా ఎంత మందిని నమోదు చేశారని వివరాలపై సిబ్బందిని ఆరా తీశారు. ఒపి నమోదు వివరాలు రికార్డులో పరిశీలించారు. పలు ఆరోగ్య సమస్యలతో వచ్చిన వారిని ఆయా రోగాల వారీగా ఎంతమంది వైద్య సేవలు వినియోగించుకుంటున్నారని అడిగారు. అనంతరం అంగన్వాడీ స్టాల్ను పరిశీలించి ఎంతమంది గర్భిణీలు, బాలింతలకు పౌష్టికాహారంపై అవగాహన కల్పించారు. స్టాల్లో ఏర్పాటు చేసిన ప్రతి పౌష్టికాహారం ఆవశ్యకతను వివరించాలన్నారు. కార్యక్రమంలో పిహెచ్సి వైద్యాధికారులు కె.వెన్నెల, ఎం.చిరంజీవి, స్పెషలిస్ట్ వైద్యులు, సర్పంచ్ ఎస్.జగదీష్, సిహెచ్ఒ రాజేశ్వరి,పంచాయతీ సెక్రటరీ వి.సీతారాం, వైద్య, సచివాలయం, అంగన్వాడీ సిబ్బంది, గ్రామ వాలంటీర్లు పాల్గొన్నారు.
భామిని : మండలంలోని బూరుజోలలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపిపి తోట శాంతికుమారి మాట్లాడుతూ గ్రామ స్థాయిలో నిపుణులైన వైద్యులచే పేదలకు ఉచితంగా ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, మందులు అందజేస్తున్నామని, కావున ఈ కార్యక్రమాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. బత్తిలి పిహెచ్సి వైద్యులు డాక్టర్ కొండపల్లి రవీంద్ర, డాక్టర్ ఫణికుమార్ ఆధ్వర్యంలో జరిగిన వైద్యశిబిరంలో 407 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి మందులు అందజేశారు. మెరుగైన వైద్యం కోసం 14 మందిని రెఫెర్ చేశారు. కార్యక్రమంలో వైసిపి మండల కన్వీనర్ తోట సింహాచలం, వైద్యులు సోయల్, సర్పంచ్ మడపానా కేశవ, వైస్ ఎంపిపి బోనగడ్డి ధర్మారావు, పసుకుడి సర్పంచ్ బెవర భార్గవనాయుడు, డిప్యూటీ తహశీల్దార్ శేఖరం, వైసిపి నాయకులు నిమ్మల త్రినాధరావు, పత్తిక సింహాచలం, నీలాద్రి, శ్రవణ్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
మక్కువ: మండలంలోని కవిరిపల్లిలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం జరిగింది. జెడ్పిటిసి సభ్యులు మావుడి శ్రీనివాసనాయుడు వైద్య సిబ్బంది ఏర్పాటు చేసిన స్టాల్స్ను పరిశీలించి రోగులకు అందిస్తున్న వైద్యసేవలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో వైసిపి మండల కన్వీనర్ మావుడి రంగునాయుడు, ఎంపిడిఒ సూర్యనారాయణ, డాక్టర్ రఘు కుమార్, ప్రజాప్రతినిధులు, వైసిపి నాయకులు, కార్యకర్తలు, అధికారులు, వైద్య సిబ్బంది, సచివాలయం ఉద్యోగులు, వాలంటీర్లు, తదితరులు పాల్గొన్నారు.










