Sep 28,2023 22:04

జాషువాకు నివాళులు అర్పిస్తున్న జాయింట్‌ కలెక్టర్‌ కేతన్‌గార్గ్‌

        అనంతపురం కలెక్టరేట్‌ : ప్రముఖ రచయిత, కవి, సాహితీకారుడు, నవయుగ చక్రవర్తి గుఱ్ఱం జాషువా సేవలు ఎనలేనివని జాయింట్‌ కలెక్టర్‌ కేతన్‌ గార్గ్‌ పేర్కొన్నారు. గురువారం అనంతపురం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్‌ హాల్‌లో జాషువా జయంతి సందర్భంగా ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా జాయింట్‌ కలెక్టర్‌ మాట్లాడుతూ జాషువాకు చిన్నతనం నుంచే సజనాత్మక శక్తి ఉండేదన్నారు. బొమ్మలు గీయడం, పాటలు పాడడం చేసేవాడిని చెప్పారు. ఆయన 36 గ్రంథాలు, మరెన్నో కవితా ఖండికలు రాశారని తెలిపారు. కవితా విశారద, కవికోకిల, నవయుగ చక్రవర్తి, విశ్వకవి సామ్రాట్‌గా బిరుదులు పొందారన్నారు. తెలుగు రాష్ట్రంలో జన్మించిన అతి గొప్ప వ్యక్తుల్లో జాషువా ఒకరన్నారు. కవి కోకిల బిరుదాంకుతులైన గుర్రం జాషువా ఉపాధ్యాయునిగా, ఆచార్యునిగా, శాసనమండలి సభ్యునిగా పని చేసి గుర్తింపు పొందారన్నారు. సాహిత్యకారునిగా సామాజిక అసమానతలు, మూఢాచారాలు, దేశభక్తి వంటి అంశాలను ఇతివత్తంగా తీసుకుని అనేక ప్రసిద్ధ రచనలు రచించడం ద్వారా తెలుగు సాహిత్య రంగానికి విశేష సేవలు అందించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా టూరిజం అధికారి నాగేశ్వర్‌ రెడ్డి, ఐఅండ్‌పిఆర్‌ డిఐపిఆర్‌ఒ గురుస్వామి శెట్టి, కలెక్టరేట్‌ ఏవో శ్రీధర్‌, కలెక్టరేట్‌ సూపరింటెండెంట్‌ పుణ్యవతి, కలెక్టరేట్‌ ఐ అండ్‌ పిఆర్‌ సిబ్బంది పాల్గొన్నారు.