Jul 23,2023 17:12

భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక ఉపసంహరణ
కాటన్‌ బ్యారేజీ వద్ద స్వల్పంగా పెరుగుతున్న గోదావరి వరద
ప్రజాశక్తి - రాజమహేంద్రవరం ప్రతినిధి
గోదావరి నది పెరుగుతూ తగ్గుతూ పరవళ్లు తొక్కుతోంది. శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకూ నీటి ప్రవాహం క్రమంఆ పెరిగింది. ఆదివారం ఉదయం 8 గంటలకు 43 అడుగులకు నీటి మట్టం చేరుకుంది. దీంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. 10 గంటలకు 43.60 అడుగులకు చేరుకుంది. అనంతరం క్రమంగా తగ్గుతూ వచ్చింది. సాయంత్రం 4 గంటలకు 42.90 అడుగులకు చేరడంతో మొదటి ప్రమాద హెచ్చరికను అధికారులు ఉపసంహరించారు. ఇదే సమయంలో ధవళేశ్వరం కాటన్‌ బ్యారేజీ వద్ద స్వల్పంగా పెరుగుతోంది. సాయ్తంరం 4 గంటలకు ధవళేశ్వరంలోని కాటన్‌ బ్యారేజీ వద్ద 10.70 అడుగుల నీటి మట్టం నమోదైంది.దీంతో 8,38,561 క్యూసెక్కుల జలాలను సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. కాలువలకు 12,100 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. వరద నిలకడగా కొనసాగుతుండటంతో లంక ప్రాంత్రాల్లో వరద నీరు అలాగే ఉంది. పి.గన్నవరంలో కనకాయిలంక కాజ్‌వే నీట మునగడంతో ప్రజలు పడవలపైనే రాకపోకలు సాగిస్తున్నారు. కె.గంగవరం మండలం కోటిపల్లిలో లాంచీల రేవును పూర్తిగా మూసేశారు.నదీ పరివాహక ప్రాంతంలో స్నానఘట్టాలను మూసేశారు. స్నానాలను నిషేదించారు.