Aug 02,2023 00:21

ప్రజాశక్తి-మండపేట
మున్సిపల్‌ కాంట్రాక్ట్‌ పారిశుధ్య, ఇంజినీరింగ్‌ విభాగాలలో పనిచేస్తున్న కార్మికులను రెగ్యులర్‌ చేయాలని సిఐటియు కార్యదర్శి నూకల బలరాం ప్రభుత్వం డిమాండ్‌ చేశారు. రాష్ట్రవ్యాప్త పిలుపులో భాగంగా మంగళవారం స్థానిక మున్సిపల్‌ కార్యాలయాన్ని కార్మికులు ముట్టడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిఎం జగన్‌ పాదయాత్రలో ఇచ్చిన హామీలో భాగంగా వారిని తక్షణం పర్మినెంట్‌ చేయాలన్నారు. కాంట్రాక్ట్‌ వర్కర్లను రెగ్యులర్‌ చేయాలన్న ప్రతిపాదనలో మున్సిపల్‌ వర్కర్లు లేకపోవడం చాలా బాధాకరమన్నారు. వ్యవస్థలో అన్నింటికన్నా హీనమైన పని మున్సిపల్‌ వర్కర్లే చేస్తున్నారని పట్టణ పరిశుభ్రతతో పాటు ప్రజల ఆరోగ్య పరిరక్షణకు వారు ఎంతగానో కషి చేస్తున్నారన్నారు. అటువంటివారిని రెగ్యులర్‌ చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుండడం సరి కాదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం మున్సిపల్‌ వర్కర్లను పర్మినెంట్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్‌ నాయకులు బంగారు కొండ, కొమరపు నరేంద్ర కుమార్‌, విజరు, రాజు, హేమలత, అమ్ములు, వెంకటలక్ష్మి, సన్యాసమ్మ తదితరులు పాల్గొన్నారు