Jul 23,2023 23:29

ప్రజాశక్తి-రామచంద్రపురం
కార్యకర్తలే నాయకులని వచ్చే ఎన్నికల్లో కార్యకర్తలకు ప్రత్యర్ధికి మధ్య పోటీ ఉంటుందని రాష్ట్ర బిసి సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు. పట్టణంలోని విజయ ఫంక్షన్‌ హాల్లో ఆదివారం వైసిపి కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఇది పోటీ సమావేశం కాదని కేవలం ఆత్మీయ సమావేశం అని తాను మంత్రి పదవి చేపట్టి మూడేళ్లు పూర్తి అయిన సందర్భంగా కార్యకర్తలు ఏర్పాటు చేసిన సమావేశం అన్నారు. కార్యకర్తలే పార్టీకి శిరోధార్యం అని అక్కడ జగనన్న, ఇక్కడ కార్యకర్తల అండ ఉండాలన్నారు. 2024 ఎన్నికల్లో అదేవిధంగా 2029, 2034 ఎన్నికలు మనమేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తనకు ఎవరో శత్రువులు లేరని ప్రత్యర్థులు మాత్రమే ఉన్నారని ఆయన అన్నారు. అదేవిధంగా జగన్‌ కి ఎవరికి ఏమి ఇ వ్వాలో తెలుసునని బోసుకు రాజ్యసభ పదవినీ, తోట త్రిమూర్తులకు ఎంఎల్‌సి పదవినీ, తనకు మంత్రి పదవి ఇచ్చారని గుర్తు చేశారు. వచ్చే ఎన్నికల్లో వైసిపి పార్టీ రాష్ట్రంలో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. భారీ ఎత్తున జన సమీకరణ జరిగిన ఈ సభలో మంత్రితో కేక్‌ కట్‌ చేయించి సన్మానించారు. కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌ పండు గోవిందరాజు, ఎపిఐడిసి డైరెక్టర్‌ వాసంశెట్టి శ్యామ్‌, ఎంపిపి అంబటి భవాని, మున్సిపల్‌ ఛైర్మన్‌ గాదంశెట్టి శ్రీదేవి, వైసిపి నాయకులు పెట్టా శ్రీనివాస్‌, టేకుమూడి సత్యనారాయణ, జెడ్‌పిటిసి సభ్యులు ఎం.వెంకటేశ్వరరావు, వరలక్ష్మి, వనం సుబ్బారావు, వ్యవసాయ సలహా కమిటీ ఛైర్మన్‌ ఇళ్ల సూర్య నారాయణ, సర్పంలు పిల్లి రాంబాబు, య ల్లమెల్లి సతీష్‌ కుమారి, కొత్తపల్లి అరుణ, వెల్లఅబ్బు, సూరిబాబు, గ్రామాల ఎంపిటిసి సభ్యులు, వైసిపి కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.