ప్రజాశక్తి-మండపేట(కోనసీమ) : జిల్లా పరిషత్ బాలికొన్నత పాఠశాల, శ్రీ వేగుళ్ల సూర్యారావు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలలో చదువుతున్న విద్యార్థులకు మున్సిపల్ చైర్పర్సన్ పతివాడ నూక దుర్గారాణి బస్ పాసులు ఉచితంగా పంపిణీ చేశారు. బుధవారం జరిగిన ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు తన వంతు సహాయ సహకారాలు అందించడంలో భాగంగా ఉచితంగా బస్ పాస్లు అందించామన్నారు. విద్యార్థులందరూ పట్టుదలతో చదివి తమ తల్లిదండ్రులకు, గ్రామానికి పేరు తీసుకురావాలన్నారు. పాఠశాలలో పంపిణీ చేస్తున్న రాగిజావను ప్రతి ఒక్కరు తాగాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎంలు మందేశ్వరరావు, ఆర్.నాగ కుమార్, పాఠశాల సిబ్బంది, రామచంద్రపురం అర్టీసీ డిపో ఉద్యోగులు కుమార్, సూరిబాబు తదితరులు పాల్గొన్నారు.










