Nov 11,2023 21:34

ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌: సామాజిక సాధికారిత పేరిట రాష్ట్రప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా బస్సుయాత్ర నిర్వహిస్తోంది. ఐదేళ్ల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీలకు అది చేశాం, ఇది చేశామని గొప్పలు చెప్పుకుంటోంది.. కానీ ఎస్సీ, ఎస్టీ, బీసి, మైనార్టీ సంక్షేమ కార్పొరేషన్లకు నిధులు ఇవ్వకుండా నిర్వీయం చేయడంతో పాటు పూటగడవక ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల్లో విద్యాబుద్థులు నేర్చుకుంటున్న విద్యార్థులకు ప్రతినెలా చెల్లించాల్సిన డైట్‌ఛార్జీలు సైతం గత ఐదు నెలలుగా అంటే ఈ ఏడాది జూన్‌ నుండీ ఇవ్వడం లేదు. దీంతో వసతి గృహ నిర్వాహకులు సంక్షేమ వసతిగృహాల్లోని విద్యార్థులకు మూడు పూటలా తిండిపెంటేందుకు నానా తంటాలు పడుతున్నారు. సామాజిక సాధికారిత అంటే ఇదేనా అంటూ ఎస్సీ, ఎస్టీ, బీసి, మైనార్టీ సంఘాల నేతలు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాయి.
వార్డెన్ల కష్టాలు వర్ణనాతీతం..
ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని 65మండలాల్లో సాంఘీక సంక్షేమశాఖ పరిధిలో 61 బాలుర వసతి గృహాల్లో 2,691 మంది బాలురు, 26 బాలికల వసతి గృహాల్లో 1,304 మంది బాలికులు మొత్తం 87 బాలుర, బాలికల వసతి గృహాల్లో 3,995 మంది విద్యార్థులు వసతి పొందుతున్నారు. అలాగే 32 కళాశాలల వసతి గృహాల్లో 15 బాలురు వసతి గృహాల్లో 897, 17 బాలికల వసతి గృహాల్లో 1,140 మంది బాలికలు మొత్తం కళాశాల సాంఘీక సంక్షమ వసతి గృహాల్లో 2,037 మంది వసతి పొందుతున్నారు. ఒక్క సాంఘీక సంక్షేమశాఖలో పెద్దసంఖ్యలో వసతి గృహాల్లో చదువుతున్న బాల, బాలికలు ఐదు నెలలుగా డైట్‌ఛార్జీలు రాకపోవడంతో ఓ వైపు విద్యార్థులు, మరోవైపు వార్డెన్లు వసతి గృహాల్లోని విద్యార్థులు ప్రభుత్వ మెనూ ప్రకారం భోజనం అందించేందుకు నానా అవస్థలు పడాల్సి వస్తోంది. గిరిజన సంక్షేమశాఖ వసతి గృహాల్లోని 2,245 మంది విద్యార్థులు, మైనార్టీ సంక్షేమ వసతి గృహం మదనపల్లిలో వంద మంది విద్యార్థులు, తిరుపతిలోని మైనార్టీ బాలికల పోస్ట్‌మెట్రిక్‌ వసతి సంక్షేమ గృహంలో 50మంది బాలికల్లో 21మంది విద్యార్థులు ఇంటర్మీడియట్‌ నుండి పిహెచ్‌డి చవుతున్నారు. ఈ మైనార్టీ సంక్షేమ వసతి గృహాల పరిస్థితి ఇంతే..
డైట్‌ ఛార్జీ రూ. 49లే..
సంక్షేమ వసతి గృహాల్లో చదువుతున్న విద్యార్థికి రోజుకు ప్రభుత్వం ఇచ్చేది రోజుకు రూ.49లు మాత్రమే. పాఠశాల విద్యార్థులకు ఉదయం అల్పహారం, రాత్రి భోజనం వండి పెట్టాల్సి ఉంటుంది. మధ్యాహ్నం పాఠశాల్లో పెట్టే మధ్యాహ్న భోజనం పెడుతున్నారు. రోజుకు ఉదయం, రాత్రి ప్రభుత్వ మెనుప్రకారం భోజనం పెట్టేందుకు ప్రభుత్వం ఇచ్చే డైట్‌ఛార్జీ రూ.49లు ఏమాత్రం సరిపోవడం లేదని డైట్‌ఛార్జీలు పెంచాలని విద్యార్థి సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. మరోవైపు ఇచ్చే డైట్‌ఛార్జీలు కూడా నెలల తరబడీ చెల్లించకపోవడంతో కిరాణాషాపు యజమానుల నుండీ ఒత్తిడి పెరుగుతోందని వసతి గృహ నిర్వాహకులు వాపోతున్నారు. చౌకదుకణాల ద్వారా ప్రభుత్వం బియ్యం మాత్రమే సరఫరా చేస్తోందని కోడిగుడ్లు, చికెన్‌, పప్పు, నూనె, కూరగాయలు ఇతర పోపు సమాన్లు బహిరంగ మార్కెట్‌లో కొనుగులు చేయాల్సి వస్తోంది. కిరాణా కొట్టులో ఒకటి, రెండు నెలలు అప్పు ఇస్తున్నారని నెలల తరబడీ డైట్‌ఛార్జీలు రాకపోవడం వల్ల కిరాణాకొట్టు యజమానులు అప్పు ఇవ్వకపోవడంతో అనేక మంది వసతి గృహ నిర్వాహకులు జీతాల నుండీ కిరాణాకొట్టు యజమానులకు డబ్బులు ఇవ్వాల్సిన దుస్థితి ఏర్పడింది.సామాజిక సాధికారిత పేరుతో రాష్ట్ర ప్రభుత్వం బస్సులు యాత్రలు నిర్వహిస్తున్న తరుణంలో ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటీ సంక్షమ విద్యార్థుల పెండింగ్‌ డైట్‌ఛార్జీలు చెల్లించాలని వసతి గృహనిర్వాహకులు, విద్యార్థి సంఘాలు, ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీ సంఘాల నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నాయి.