
నగరి: నగరి పట్టణానికి విచ్చేసిన బీజేపీ జిల్లా నాయకులు మంత్రి రోజాకు సవాల్ విసురుతామంటూ వ్యవహరించిన తీరుపై నగరి డైయింగ్ అసోసియేషన్ సభ్యులు, వైఎస్సార్ కాంగ్రెస్ నాయకుల ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం నగరి పట్టణంలో సమావేశమైన వారు మాట్లాడుతూ నగరి విచ్చేసిన జిల్లా బీజేపీ రాష్ట్ర మీడియా ప్రతినిధి భాను ప్రకాష్రెడ్డి, జిల్లా అధ్యక్షుడు జగదీశ్వర్ నాయుడు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు చిలకం ఈశ్వర్ప్రసాద్లు ముఖ్యమంత్రి జగన్ మోహన్రెడ్డిపైనా, మంత్రి రోజాపైనా, నగరి అభివద్ధిపైనా చేసిన విమర్శలపై వారు మండిపడ్డారు. నిర్వహణలో ఉన్న ఎఫ్లూయంట్ ట్రీట్మెంట్ ప్లాంటును ప్రత్యక్షంగా చూసినా అభివద్ధి జరగలేదని బీజేపీ నాయకులు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఎలా ఉన్నా బాగాలేదని చెప్పేద్దాం అన్న ధోరణిలోనే వారు నగరికి విచ్చేసినట్లు స్పష్టమౌతోందన్నారు. మహానేత వైఎస్సార్ పాలనలో ప్లాంటును నిర్మిస్తే ఆపై వచ్చిన ప్రభుత్వాల పాలనలో నిర్వహణకు నోచుకోక పాడుబడిన విషయం బీజేపీ నాయకులకు తెలియదా? అని ప్రశ్నించారు. ఈ రోజు మాట్లాడిన నోళ్లు ఆరోజు ఏమైందని ప్రశ్నించారు. మంత్రి ఆర్కేరోజా చూపిన ప్రత్యేక చొరవతోనే ప్లాంటు నేడు నిర్వహణలో ఉందన్నారు. ప్లాంటుకున్న 2 కోట్ల విద్యుత్ బకాయిలను మున్సిపాలిటీ ద్వారా చెల్లించడం జరిగిందని ఆపైనే నగరి డైయింగ్ అసోసియేషన్ సభ్యులకు నిర్వహణను కేటాయించారన్నారు. బీజేపీ నాయకుల మాటల్లోనే స్పష్టత లేదని వాళ్లు చెప్పారు, వీళ్లు చెప్పారు అనడంలోనే వారు చేసిన పరిశీలన ఏపాటిదో అందరికీ అర్ధమౌతోందన్నారు. నేతకార్మికులపై ప్రేమతోనో, ప్రజలపై ప్రేమతోనే వారు నగరికి రాలేదని మంత్రి రోజాపై అక్కసుతోను, పార్టీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి వద్ద మెప్పుపొందాలన్న నెపంతోనే రావడం జరిగిందన్నారు. ప్రజలకోసం వచ్చేవారైతే ఇన్నాళ్లు వారికి నగరి మార్గం కనిపించలేదా అని ప్రశ్నించారు. సమావేశంలో మున్సిపల్ చైర్మన్ పీజీ నీలమేఘం, అధ్యక్షులు ఏజీ మణిగండన్, ఉపాధ్యక్షులు పీఎస్ దేవరాజ్, ట్రెజరర్ టీజీబీ విశ్వనాధన్, వైఎస్సార్సీపీ నాయకులు పురుషోత్తం,బాబు, ఎంఆర్బాలు పాల్గొన్నారు.