
గుర్తు తెలియని వాహనం ఢకొీని...
చిరుత మృతి
ప్రజాశక్తి -వి.కోట
మండల పరిధిలోని నాయకనేరి అటవీ ప్రాంతంలో గుర్తు తెలియని వాహనం ఢకొీని చిరుత పులి మృతి చెందిన సంఘటన వెలుగు చూసింది. మంగళవారం రాత్రి నాయకనేరి అటవీ ప్రాంతంలో రోడ్డు దాటే క్రమంలో గుర్తుతెలియని వాహనం చిరుత పులిని ఢకొీందని అటవీశాఖ అధికారులు తెలిపారు. రోడ్డు మధ్యన పడి ఉన్న చిరుత మృతదేహాన్ని గుర్తించిన వాహనదారులు అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. మృతి చెందిన చిరుతకు 10 ఏళ్ల వయసు ఉంటుందని, ఆడ చిరుతగా గుర్తించారు. ఇంత వయసున్న చిరుత ఒంటరిగా ఉండే అవకాశం లేదని తోడుగా మరో చిరుత ఉండే అవకాశం ఉంటుందని అటవీ శాఖ వారు భావిస్తున్నారు. సంఘటన జరిగిన ప్రాంతం తమిళనాడు పరిధిలోకి వస్తుందని, అక్కడ జరిగిన ప్రమాదాన్ని ఆంధ్ర వైపు మళ్లించేందుకు చిరుత మృతదేహాన్ని ఆంధ్ర సరిహద్దులో పడేసి ఉంటారని పలమనేరు ఎఫ్ఆర్ఒ శివన్న తెలిపారు. చిరుత మృతి చెందిన సమాచారాన్ని తమిళనాడు అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చామని, చిరుత పంచనామా నిమిత్తం తిరుపతి వైద్యులకు సమాచారం ఇచ్చామని అధికారులు తెలిపారు. సంఘటనా స్థలాన్ని పలమనేరు ఎఫ్ఆర్ఒ శివన్న, డిఆర్ఓ చంద్రశేఖర్ రెడ్డి, అటవీ శాఖ సిబ్బంది సందర్శించారు.