గృహ నిర్మాణాలు వేగంగా జరిగేలా చూడాలి
కృష్ణాజిల్లా జాయింట్ కలెక్టర్ అపరాజితాసింగ్
ప్రజాశక్తి-పమిడిముక్కల
నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు పథకంలో భాగంగా జగనన్న వైఎస్సార్ కాలనీల్లో గృహ నిర్మాణాలు వేగవంతంగా జరిగేలా చూడాలని కృష్ణాజిల్లా సంయుక్త కలెక్టర్ డాక్టర్ అపరాజితా సింగ్ కోరారు. పమిడిముక్కల మండలం తాడంకి పంచాయతీ పరిధిలోని జగనన్న లేఔట్లను పామర్రు ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్తో కలిసి శుక్రవారం ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా జెసి మాట్లాడుతూ పునాది స్థాయి(బి. ఎల్) ఆపై స్థాయిల్లో ఉన్న గృహ నిర్మాణాలు వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. ఇందుకోసం దశల వారీ పూర్తి చేసే విధంగా లక్ష్యాలను నిర్దేశించు కోవాలన్నారు. మండలంలోని అన్ని లే అవుట్లలో ఇళ్ల నిర్మాణం పురోగతి సాధించేందుకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. సంబంధిత ఆర్డీవోలు, ఎంపీడీవోలు, తహసీల్దారులు, గహ నిర్మాణ సంస్థ అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించి నిర్ణీత లక్ష్యాలను సాధించేందుకు కృషి చేస్తున్నారన్నారు. గృహాల నిర్మాణానికి అవసరమైన సిమెంటు, ఇనుము, ఇసుక తదితర సామాగ్రితో పాటు బ్యాంకుల ద్వారా ఆర్థిక సాయం అందించేందుకు అన్ని విధాలా తోడ్పడాలని కోరారు. లే అవుట్లలో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. కరెంటు సౌకర్యం, రోడ్ల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని కోరారు. రైతుల వద్ద ఉన్న పెండింగ్ ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో విజయకుమార్, తహశీల్దార్ బి.రాజ్యలక్ష్మి, పమిడిముక్కల ఎంపిడిఒ సుధా ప్రవీణ్ , విద్యుత్ ఎఇ శ్రీనివాస్, తాడంకి గ్రామ కార్యదర్శి సునీత, వైసిపి నాయకులు వీరంకి చిరంజీవి, యేనుగ వెంకటేశ్వరరావు, కొడాలి రాంబాబు, హౌసింగ్ ఏఈ ప్రసాద్, జంపాన వెంకటేశ్వరరావు, పంచాయతీరాజ్ ఎఇ షరాబంది రాజు తదితరులు పాల్గొన్నారు.










