Nov 14,2023 22:54


గృహ నిర్మాణ శాఖపై సమీక్షిస్తున్న జాయింట్‌ కలెక్టర్‌ శ్రీనివాసులు
ప్రజాశక్తి- చిత్తూరు: రాష్ట్ర ప్రభుత్వం గృహనిర్మాణాలకు, ప్రాధాన్యత భవనాల నిర్మాణాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని ఈనిర్మాణాలను ప్రణాళిక బద్ధంగా వేగవంతంగా పూర్తిచేయాలని జాయింట్‌ కలెక్టర్‌ పి.శ్రీనివాసులు అన్నారు. మంగళవారం జాయింట్‌ కలెక్టర్‌ ఎంపీడీవోలు, గృహ నిర్మాణశాఖ అధికారులు, పంచాయతీరాజ్‌ ఇంజనీరింగ్‌ అధికారులతో కలెక్టరేట్‌లోని సమావేశ మందిరం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్‌ కలెక్టర్‌ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గృహనిర్మాణాలను పూర్తిచేయడానికి ప్రణాళికను ఇచ్చిందని ఆ ప్రణాళిక మేరకు నిర్మాణాలను వేగవంతం చేసి నిర్ణీత కాలవ్యవధి లోపల పూర్తి చేయాలన్నారు. క్షేత్రస్థాయిలో ప్రణాళికలను రూపొందించుకొని ఆ ప్రణాళికల మేరకు నిర్మాణాలు పూర్తిచేసుకోవాలని ఇందుకోసం స్టేజిల వారీగా కన్వర్షన్‌ చేయాలని, గత వారం లక్ష్యాలను పూర్తి చేయాలన్నారు. ప్రభుత్వ ప్రాధాన్యత భవనాలైన గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు. హెల్త్‌క్లినిక్‌ల నిర్మాణాలు వేగవంతం చేయాలని, వేగవంతంగా వాటిని పూర్తిచేయాలని అన్నారు. ఇందుకోసం వారం వారి ప్రణాళికలను అధికారుల నుంచి తీసుకొన్నారు. ఈ నెల 22వ తేదీకి నిర్ణయించుకున్న ప్రణాళికల మేరకు నిర్మాణాలు పూర్తి కావాలని ఆదేశించారు. కార్యక్రమంలో గృహ నిర్మాణశాఖ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ పద్మనాభం, జడ్పీ సీఈఓ ప్రభాకర్‌రెడ్డి, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈ విజరు కుమార్‌, పంచాయతీరాజ్‌ ఎస్‌ఈ చంద్రశేఖర్‌ రెడ్డి, ఈఈ చంద్రశేఖర రెడ్డి, డిపిఓ లక్ష్మీ పాల్గొన్నారు.