గృహ నిర్మాణాల్లో కృష్ణాజిల్లా ఉత్తమ ప్రతిభ
ప్రజాశక్తి-కలెక్టరేట్ (కృష్ణా)
గృహ నిర్మాణాల ప్రగతిలో రాష్ట్రంలోనే కృష్ణాజిల్లా ఉత్తమ ప్రతిభను కనబర్చిందని గృహ నిర్మాణ సంస్థ ఇన్ఛార్జి పిడి జి.వి.సూర్యనారాయణ వెల్లడించారు. రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ 45వ హౌసింగ్ కార్పొరేషన్ దినోత్సవం సందర్భంగా జరిగిన ఉత్సవంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ, అజరు జైన్, ఎం.డి. లక్ష్మిషా చేతుల మీదుగా పిడి అవార్డు అందుకున్నారు. రాష్ట్రస్థాయిలో నిర్ధేశించిన ఐదు లక్షల గృహాలను పూర్తి చేసే లక్ష్యాల్లో కృష్ణా జిల్లా 93 శాతం పూర్తి చేసి రాష్ట్రంలో రెండో స్థానంలోనూ, కొద్ది కాలంలోనే బిలో బేస్మెంట్ లెవెల్ నుండి బేస్మెంట్ లెవెల్కి 15 వేల ఇళ్లను పూర్తిచేసిన సందర్భంగా అవార్డు అందుకున్నారు. జిల్లా కలెక్టర్ పి.రాజబాబు కృషితో పాటు జిల్లా హౌసింగ్ అధికారులు, సిబ్బంది, సమిష్టి కృషితోనే ఈ పురోగతి సాధ్యమైందని సూర్యనారాయణ తెలిపారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ పి.రాజాబాబును గురువారం ఆయన ఛాంబర్లో కలిసి అభినందనలు తెలిపారు.










