
ప్రజాశక్తి - భీమడోలు
గుండుగొలను శాఖ గ్రంథాలయ సేవలు వినియోగించుకోవాలని గ్రంథ పాలకురాలు గారపాటి నాగమణి, అభివృద్ధి కమిటీ ఛైర్మన్ నల్ల శంకర్ కోరారు. ఈనెల 14వ తేదీ నుంచి 20వ తేదీ వరకు గ్రంథాలయ వారోత్సవాలు నిర్వహించనున్న నేపథ్యంలో వారి ఆధ్వర్యంలో గ్రంథాలయ సేవల పట్ల ప్రజలకు అవగాహన కల్పించేందుకు, ప్రచారం కోసం పురవీధుల్లో సోమవారం ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రంథ పాలకులు మాట్లాడుతూ తాను బాధ్యతలు స్వీకరించిన తర్వాత నూతనంగా చేరిన గ్రంథాలయ సభ్యులతో కలిపి ప్రస్తుతం గ్రంథాలయ సభ్యుల సంఖ్య 1,120కి చేరిందన్నారు. గ్రంథాలయంలో 15 వేల వరకు వివిధ రకాల పుస్తకాలు అందుబాటులో ఉన్నాయన్నారు. ముఖ్యంగా నిరుద్యోగ యువత పోటీ పరీక్షలకు హాజరయ్యేందుకు అవసరమైన స్టడీ మెటీరియల్తో పాటు విద్యార్థులకు అవసరమైన వివిధ పుస్తకాలు అందుబాటులో ఉన్నాయన్నారు. దాతల సహకారంతో గ్రంథాలయానికి కొన్ని పుస్తకాలు అదనంగా వచ్చాయన్నారు. నిరుద్యోగ యువతకు అవసరమైన కంప్యూటర్ పరిజ్ఞానం అందించేందుకు తగు ఏర్పాట్లు జరుగుతున్నట్టు వివరించారు. జిల్లా గ్రంథాలయ సంస్థ ఆదేశాల మేరకు విద్యార్థుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన వివిధ కార్యక్రమాలను సజావుగా నిర్వహిస్తున్నామన్నారు. గ్రంథాలయం గ్రామ మధ్యలో ఉండటం, విశాలమైన స్థలము ఉన్న నేపథ్యంలో ప్రజలకు అవసరమైన స్టేజి నిర్మాణంతో పాటు ఆవరణం క్రీడా మైదానంగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు వివరించారు.