Aug 27,2023 22:02

ఓటరు జాబితాను పరిశీలిస్తున్న సబ్‌కలెక్టర్‌ నూరుల్‌కమర్‌

గుమ్మలక్ష్మీపురం: మండలంలో ఎక్కువగా ఓట్లు తొలగించిన లాడ, దొరజమ్ము, రేగిడి గ్రామాల్లో పాలకొండ సబ్‌ కలెక్టర్‌ నూరుల్‌ కమర్‌ ఆదివారం ఆకస్మిక పర్యటన చేపట్టారు. ఈ సందర్భంగా సబ్‌కలెక్టర్‌ ఆయా గ్రామాల్లో ఓట్లు తొలగించిన వ్యక్తులను పిలిపించి స్వయంగా ఫారం-7లను పరిశీలించారు. ఎందుచేత ఏ కారణంతో ఆయా వ్యక్తుల ఓట్లను సిబ్బంది తొలగించారన్న వివరాలను అడిగి తెలుసుకున్నారు. గ్రామాల్లో మరణానంతరం, వేరే ప్రదేశానికి వెళ్లిన వ్యక్తుల ఓట్లను మాత్రమే నిబంధనల ప్రకారం తొలగించాలని, లేనిపక్షంలో ఏ కారణంతోనైనా గ్రామంలో ఉన్న వ్యక్తుల ఓట్లను తొలగించకూడదని అన్నారు. ఒకవేళ అటువంటి ఓట్లను తొలగిస్తే సంబంధిత బిఎల్‌ఒలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆయన వెంట తహశీల్దార్‌ జె.రాములమ్మ, బిఎల్‌ఒలు, రాజకీయ పార్టీల నాయకులు తదితరులు ఉన్నారు.