ప్రజాశక్తి పుట్టపర్తి అర్బన్ : నిర్ణీత గడువులోగా మొదటి దశ రీ సర్వే పూర్తి చేస్తామని కలెక్టర్ అరుణ్ బాబు తెలిపారు. రీ సర్వే ప్రక్రియ, గృహ నిర్మాణాల పురోగతి, జాతీయ రహదారులకు భూ సేకరణ తదితర అంశాలపై రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ జవహర్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గురువారం సమీక్షించారు. రీ సర్వే, జాతీయ రహదారులకు భూ సేకరణ, గృహ నిర్మాణ పనులు వేగవంతంగా పూర్తి చేయాలని జవహర్ రెడ్డి ఆదేశించారు. పర్యాటక శాఖ కు చెందిన భూమి అలియనేషన్ త్వరగతిన పూర్తి చేయాలని వ్యవసాయ అనుబంధ శాఖలు పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖలు ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని అన్నారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా కలెక్టర్ అధికారులతో సమావేశమయ్యారు. జగనన్న భూ హక్కు భూ రక్ష రీసర్వే సకాలంలో పూర్తి చేయాలన్నారు. మొదటి దశలో రీ సర్వే ప్రక్రియ పూర్తి అయిన వాటికి రాళ్లు నాటే కార్యక్రమం వేగవంతం చేయాలని ఆదేశించారు. ఈ నెలలోపు ఈ పనులు పూర్తి చేయాలన్నారు. గృహ నిర్మాణం పనులు నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని, జాతీయ రహదారులకు భూ సేకరణ త్వరగతిన పూర్తి చేయాలన అన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ టిఎస్ చేతన్, డిఆర్ఒకొండయ్య, గృహ నిర్మాణ శాఖ పీడీ చంద్రమౌళి రెడ్డి, సిపిఒ విజరు కుమార్, ల్యాండ్స్ రికార్డ్స్ ఎడి రామకృష్ణ, డిఆర్డిఎ పీడీ నరసయ్య, పిఆర్ ఎస్ఇ గోపాల్ రెడ్డి, వ్యవసాయ అధికారి సుబ్బారావు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.










