Sep 19,2023 19:29

పోలీసుల అదుపులో శ్రీనివాసులు

ప్రజాశక్తి - ఆదోని
ముఖ్యమంత్రి పర్యటనను అడ్డుకుంటున్నారని ముందస్తు సమాచారంతో ఆదోనిలో పోలీసులు అప్రమత్తమయ్యారు. సోమవారం రాత్రి ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షులు శ్రీనివాసులును అదుపులోకి తీసుకున్నారు. ఆదోని శివారులోని పర్వతాపురం కాలనీలో నివాసముంటున్న శ్రీనివాసులు ఇంటికి వన్‌టౌన్‌ పోలీసులు వెళ్లి అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. మంగళవారం శ్రీనివాసులు విలేకరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ముందస్తుగా పోలీసులు అరెస్టు చేయడం సమంజసం కాదని తెలిపారు. క్రిష్ణగిరి మండలం లక్కసాగరం పంపు హౌస్‌ నుంచి 77 చెరువులకు నీరందించే పథకాన్ని ప్రారంభించేందుకు ముఖ్యమంత్రి జగన్‌ పర్యటిస్తున్నారని చెప్పారు. జగన్‌ను అడ్డుకుంటారన్న నెపంతో ఆదోని పోలీసులు తమను ముందుగానే నిర్బంధించడం భావ్యం కాదన్నారు. అక్రమ అరెస్టులతో ప్రశ్నించే వారిని అణిచివేయాలన్న ఆలోచన విధానాన్ని ముఖ్యమంత్రి జగన్‌ మార్చుకోవాలని తెలిపారు. లేకపోతే వచ్చే ఎన్నికల్లో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.