
ప్రజాశక్తి - ఉంగుటూరు
కొల్లేరు ఎకో సెన్సిటివ్ జోన్ పేరుతో కేంద్ర ప్రభుత్వం ఐదో కాంటూరు పరిధి దాటి పది కిలోమీటర్ల వరకూ పర్యావరణం పేరుతో 26 నిబంధనలను పెట్టి వేలాదిమంది ప్రజల జీవితాలతో చెలగాటమాడుతుందని రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం, సిఐటియు నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. శుక్రవారం మండలంలోని కైకరం, తల్లాపురం గ్రామాలను వారు సందర్శించారు. తల్లాపురంలో సర్పంచి పసుపులేటి నరసింహారావుతో పాటు గ్రామ రైతులు పాల్గొన్న సమావేశంలో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎ.రవి, రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్, సిఐటియు జిల్లా అధ్యక్షులు ఆర్.లింగరాజు, రైతు సంఘం నేత గుత్తికొండ వెంకటకృష్ణారావు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పిల్లి రామకృష్ణ, కౌలు రైతు సంఘం జిల్లా కన్వీనర్ కొర్ని అప్పారావు తదితరులు మాట్లాడారు. 2006లో కొల్లేరు ఆపరేషన్ పేరుతో జిరాయితీ, సొసైటీ చెరువులను నాడు ధ్వంసం చేసి కొల్లేరు ప్రజలను అనాధలను చేశారని, నేడు మళ్లీ పర్యావరణ సున్నిత ప్రదేశం పేరుతో ఐదో కాంటూరు పైన ఉన్న 89 గ్రామాల ప్రజల కొంప కొల్లేరు చేసే ఈ నిర్ణయాన్ని తక్షణం ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు. పార్టీలకతీతంగా అన్ని గ్రామాల ప్రజలు ఐక్యమై ప్రతిఘటించాలని అలాగే అన్ని గ్రామాల్లో ఉన్న పంచాయతీలు తీర్మానాలు చేసి తమ వ్యతిరేకతను ప్రభుత్వానికి తెలియజేయాలని, రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక ప్రజాప్రతినిధులు ఈ ఎకో సెన్సిటివ్ జోన్కు వ్యతిరేకంగా ప్రజలతో కలిసి ఉద్యమించాలని వారు పిలుపునిచ్చారు. మోడీ ప్రభుత్వం ప్రజల కంటే పక్షులకే ఎక్కువ ప్రాధాన్యతివ్వడం దుర్మార్గమన్నారు. ప్రజలకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్, కేంద్ర ప్రభుత్వం వారు వాస్తవ విషయాలను చెప్పి ప్రజాభిప్రాయం సేకరించడం బదులు కేవలం మండల కేంద్రాల్లో కొద్దిమందితో అభిప్రాయ సేకరణ జరిపి ప్రజలకు వ్యతిరేకమైన అభిప్రాయాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తే చూస్తూ ఊరుకోబోమని వారు హెచ్చరించారు.
ఐదో కాంటూరు వరకే సెన్సిటివ్ జోన్గా నిర్ణయించాలి
ప్రజాశక్తి - మండవల్లి
కొల్లేరు అభయారణ్యం చుట్టూ సున్నిత పర్యావరణ ప్రాంతం ఏర్పాటు కంటే ముందుగా కొల్లేరు ఆక్రమణలు, కాలుష్యం నివారించి, ముంపు నివారణ సరస్సు అభివృద్ధి, ప్రజల జీవనోపాధికి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక కార్యకర్తలు ఎల్ఎస్.భాస్కర్రావు స్పష్టం చేశారు. కొల్లేరు అభయారణ్య ప్రతిపాదిత సున్నిత పర్యావరణ ప్రాంతంపై ఆయన అభిప్రాయాన్ని తెలియజేస్తూ అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ కైకలూరు కార్యాలయంలో వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొల్లేరు అభయారణ్యంలో ఆక్రమణలు పెరిగి రొయ్యలు, చేపల చెరువుల నిర్మాణం జరిగిందన్నారు. మితిమీరి సాగుతున్న రొయ్యల సాగుతో విడుదలవుతున్న రసాయనాలు, ఉప్పునీరు, వ్యర్థాలు, కొల్లేరులో చేరి కలుషితమవుతుందని తెలిపారు. కొల్లేరు కలుషితమవడం వల్ల అపారమైన మత్స్య సంపద నానాటికీ తగ్గిపోతుందని, కొన్నిరకాల నల్లజాతి చేపల సంతతి కనుమరుగవుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కొల్లేరు ఆపరేషన్కు ముందు కొల్లేరు ప్రజల జీవనోపాధి ఎలా ఉందో ఆ తర్వాత కూడా అంతకు తగ్గకుండా ఉండేలా చూడమని సుప్రీంకోర్టు సాధికారత కమిటీ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించినప్పటికీ 17 ఏళ్లుగా ఎవరూ పట్టించుకోలేదన్నారు. రెగ్యులేటర్ నిర్మాణం ఛానలైజేషన్ పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి ముంపు నివారణ వంటి అంశాలపై ప్రభుత్వం దృష్టి పెట్టకపోవడం బాధాకరమన్నారు. కొల్లేరు పదో కాంటూరు మేర పరివాహక ప్రాంతంగా ఉన్నప్పటికీ 120 జిఒతో ఐదో కాంటూర్ వరకూ ఆక్రమణలు తొలగించి పరిమితం చేశారన్నారు. ఐదో కాంటూరు పరివాహక ప్రాంతాలకు ఎకో సెన్సిటివ్ జోన్గా మాత్రమే నిర్ణయించాలని పది కిలోమీటర్ల మేర పెంచడం వల్ల ఉపయోగం లేకపోగా నష్టం వాటిల్లుతుందన్నారు. దీనివల్ల కొల్లేరు గ్రామాల ప్రజలతోపాటు మరికొన్ని గ్రామాల ప్రజలు ఉపాధిని కోల్పోతారని ఆయన తెలిపారు. పక్షులకు ఇబ్బందులు కలగకుండా ప్రజలకు జీవనోపాధి ఉండేలా పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసేలా తగు చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక మండల శాఖ అధ్యక్షులు టి.అప్పారావు పాల్గొన్నారు.