గుమ్మలక్ష్మీపురం: మండలంలోని ఎగువ మండకు వెళ్లే ప్రధాన రహదారి వద్ద వంతెన నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని వైసిపి జిల్లా అధ్యక్షులు శత్రుచర్ల పరీక్షిత్ రాజు హామీ ఇచ్చారు. తన పర్యటనలో భాగంగా శనివారం ఎగువమండలో కల్వర్టును పరిశీలించారు. వర్షాకాలం వచ్చిందంటే చాలు గెడ్డ వాగు ప్రవాహం పెరగడంతో విద్యార్థులు, ఉద్యోగులు, రోగుల రాకపోకలకు ఇబ్బందిగా మారుతుందని గ్రామస్తులు వివరించారు. పదేళ్లు క్రితం నిర్మించిన కల్వర్టు భారీ వర్షాలకు కొట్టుకుపోయిందన్నారు. నాటి నుంచి నేటి వరకు దాని స్థానంలో వేరే కల్వర్టు నిర్మించకపోవడంతో కొన్నేళ్లుగా ఈ సమస్యతో ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. సమస్య విన్న పరీక్షిత్రాజు మాట్లాడుతూ వంతెన నిర్మాణానికి హామీ ఇచ్చారు. ఈ పర్యటనలో ఎంపిపి కుంబిరిక దీనమయ్య, సర్పంచులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
మల్లేష్ మృతి పార్టీకి తీరని లోటు
వైసిపి కార్యకర్త, సచివాలయ కన్వీనర్ మల్లేష్ ఆకస్మికంగా మృతి చెందడం పార్టీకి తీరని లోటని వైసిపి జిల్లా అధ్యక్షులు శత్రుచర్ల పరీక్షిత్ రాజు అన్నారు. ఎగుమండ గ్రామాన్ని సందర్శించి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. మల్లేష్ పంచాయతీలో పార్టీ అభివృద్ధికి ఎంతగానో కృషి చేశారని కొనియాడారు. కొంత నగదును ఆర్థిక సహాయం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి కె. దీనమయ్య , నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.










