
ఎట్టకేలకు మహిళా రిజర్వేషన్ బిల్లుకు లోక్సభ ఆమోదం తెలపడం హర్షణీయం. దాదాపుగా పార్లమెంటులోని అన్ని పార్టీలు బలపరుస్తుండటంతో రాజ్యసభలోనూ ఆమోదం పొందడం లాంఛనమే. ఆ తరువాత కనీసం సగం రాష్ట్రాల అసెంబ్లీలు దీనిని ఆమోదించాల్సి ఉంది. బిల్లు చట్ట రూపం దాల్చితే లోక్సభతో పాటు రాష్ట్రాల శాసనసభల్లో మహిళలకు 33 శాతం సీట్లు దఖలు పడతాయి. ఇది ఒక్కరోజులో చోటుచేసుకున్న పరిణామం ఏమీ కాదు. దశాబ్దాల తరబడి మహిళాలోకం చట్టసభల్లో రిజర్వేషన్ల కోసం పోరాడుతోంది. ఆకాశంలో సగానికి, అవకాశాల్లో కూడా సగం ఇచ్చి తీరాలని నినదిస్తోంది. నిజానికి జాతీయోద్యమంలోనే ఈ దిశలో ఆకాంక్షలు వ్యక్తమైనాయి. స్వతంత్ర పోరాటంలో ముందుకురికిన పలువురు మహిళా నేతలు సమభావనను వ్యక్తం చేశారు. నేతాజీ ఏర్పాటు చేసిన అజాద్ హింద్ ఫౌజ్లో మహిళా దళపతిగా బ్రిటిష్వారిపై సమరశంఖం పూరించిన కెప్టెన్ లక్ష్మీ సెహగల్ చివరి వరకు సమానత్వ పోరునే శ్వాసించారు. స్వాతంత్య్రం వచ్చిన తరువాత, రాజ్యాంగ సభ సభ్యురాలు హంసా మెహతా అన్ని రంగాల్లో సమన్యాయం కోరుతున్నామని చెప్పారు. స్వతంత్ర భారతదేశంలో మహిళలకు పురుషులతో సమానంగా అన్ని రంగాల్లోనూ అవకాశాలు లభిస్తాయని ఆమె ఆకాంక్షించారు. రాజ్యాంగ పీఠికలోనూ, ఆదేశ సూత్రాల్లోనూ ఈ భావనే వ్యక్తమైంది. కానీ, ఆచరణలో ఏం జరిగిందో చూశాం! సమాన అవకాశాల సంగతి అలా ఉంచితే, ప్రాతినిధ్యం కోసమే పోరాటం చేయాల్సి వచ్చింది. ఇప్పుడు కూడా బిల్లులో ప్రతిపాదించింది కూడా 33 శాతమే కావడం గమనార్హం! స్థానిక సంస్థల రిజర్వేషన్ల రూపంలో వచ్చిన అవకాశాన్ని మహిళలు అందిపుచ్చుకున్నారు. అత్యధిక చోట్ల స్థానిక సంస్థల బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహించారు. సమర్ధతను నిరూపించుకుని అభివృద్ధికి బాటలు వేశారు. ఎన్నో అవమానాలను, అవహేళనలను, అవాంతరాలను అధిగమించి పట్టుదలతో భారత మహిళాలోకం సాగించిన పోరాట ఫలితమే ఈ బిల్లు! అందుకే వారికి జేజేలు!
సుదీర్ఘ పోరాట ఫలితంగా వాస్తవరూపం దాల్చనున్న మహిళాలోకపు ఈ స్వప్నాన్ని సైతం ఎన్నికల ప్రయోజనాలకు వాడుకోవడానికి మోడీ, ఆయన పరివారం సిద్ధపడటం దారుణం. మోడీ ఘనతగా దీనిని చిత్రీకరించడానికి బిజెపి ప్రయత్నిస్తోంది. నిజానికి, తొమ్మిదేళ్ల మోడీ సర్కారు వైఫల్యాల నుండి దేశ ప్రజల, ముఖ్యంగా మహిళల దృష్టి మళ్లించడానికి చేస్తున్న ప్రయత్నమిది. మహిళా రిజర్వేషన్ల బిల్లు 2014 ఎన్నికల ప్రచారం సందర్భంగా మోడీ ఇచ్చిన హామీ. అంత చిత్తశుద్ధి ఉంటే అధికారంలో కొనసాగిన ఈ తొమ్మిదేళ్లు ఏం చేశారు? చివరి దశలో బిల్లును ఎందుకు ప్రవేశపెడుతున్నారు? పోనీ, తక్షణం జరగనున్న 2024 ఎన్నికల్లో మహిళలకు ఏమైనా ప్రయోజనం కలుగుతుందా? ఎన్నికల తరువాత ఏర్పడనున్న 18వ లోక్సభలో మహిళల సీట్లు ఏమన్నా పెరగనున్నాయా? బిల్లులో పేర్కొన్న ప్రకారం అలా జరగదు. ముందు జనాభా లెక్కల ప్రక్రియ పూర్తికావాలి. ఆ తరువాత నియోజకవర్గాల పునర్విభజన జరగాల్సి ఉంది. అప్పుడే కొత్త రిజర్వేషన్లు అమలులోకి వస్తాయి. లోక్సభలో బుధవారం జరిగిన చర్చలో మాట్లాడిన హోంమంత్రి అమిత్షా 2029 ఎన్నికల నాటికి రిజర్వేషన్లు అమలులోకి వస్తాయని చెప్పారు. మరి ఇప్పుడు ఈ హడావిడి ఏ ప్రయోజనాల కోసమో అర్ధం కావడం లేదూ! అందుకే, బిల్లుకు మద్దతు తెలిపిన అనేక పార్టీలు రిజర్వేషన్లను తక్షణం అమలులోకి తీసుకురావాలని డిమాండ్ చేశాయి.
మోడీ సర్కారుపై ప్రజానీకంలో కొంత కాలంగా అసంతృప్తి వ్యక్తమవుతోంది. దీంతో ఎన్నికల వేళ ఆపదమొక్కులు ప్రారంభించారు. కొద్ది రోజుల క్రితమే గ్యాస్ ధరను తగ్గించిన మోడీ ప్రభుత్వం ఇప్పుడు మహిళా బిల్లును ముందుకు తెచ్చింది. 'నస్త్రీ స్వాతంత్య్రమర్హతి' అనే మనువాద భావజాలానికి పట్టం కట్టే బిజెపి మహిళాభ్యున్నతికి ఎప్పటికీ వ్యతిరేకమే! ఎన్నికల వేళ ఆ పార్టీ ప్రదర్శించే ఇటువంటి టక్కుటమార విద్యల పట్ల అప్రమత్తంగా ఉండాలి.