Jun 26,2023 21:59

పోస్టర్లు విడుదల చేస్తున్న నాయకులు

ప్రజాశక్తి - ధర్మవరం టౌన్‌ : రైతాంగ సమస్యల పరిష్కారం కోసం ఈనెల 30న విజయవాడలో మహాధర్నా నిర్వహిస్తున్నామని ఈ ధర్నాకు రైతులు అధికసంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని రైతుసంంఘం జిల్లా అధ్యక్షులు జంగాలపల్లి పెద్దన్న పిలుపు నిచ్చారు. ఈ మేరకు సిపిఎం స్థానిక కార్యాలయం వద్ద సోమవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మహాధర్నాకు సంబంధించిన గోడపత్రికలను ఆయనతోపాటు ఏపీ చేనేత కార్మికసంఘం రాష్ట్ర అధ్యక్షులు పోలా రామాంజినేయులు, రైతుసంఘం మండల అధ్యక్షులు కొత్తపేట మారుతి తదితరులు విడుదల చేశారు. ఈ సందర్భంగా జంగాలపల్లి పెద్దన్న మాట్లాడుతూ గత ఏడాది నవంబరు, డిసెంబరు, ఈ ఏడాది ఏప్రిల్‌, మే నెలలో కురిసిన వర్షాలకు పంటలు దెబ్బతిని రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. గత ఏడాది ఖరీప్‌, రబీ సీజన్లలో పంటలు నష్టపోయిన రైతులందరికీ ఇన్‌పుట్‌ సబ్సిడీ, పంటలబీమా వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరలు కనీసం పెట్టుబడులకు కూడా చాలవని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం ధరలపై అదనంగా 20శాతం బోనస్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించే పక్రియ, వ్యక్తులకు, వాణిజ్య సంస్థలకు ప్రవేశించడానికి ఇచ్చిన జీవో 254ను ఉపసంహరించాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎస్‌హెచ్‌ బాషా, రేగాటిపల్లి రవి తదితరులు పాల్గొన్నారు.