దళితులపై అడుగడుగునా వివక్ష
- మాల మహానాడు
ప్రజాశక్తి - కొత్తపల్లి
ప్రోటోకాల్ పాటించని వారిపై ముఖ్యమంత్రి చర్యలు తీసుకోవాలని మాల మహానాడు నాయకులు కదిరి సుబ్బన్న, గనముల పరశురాముడు, కిరణ్ ప్రసాద్, దాసు కోరారు. మంగళవారం కొత్తపల్లిలోని అంబేద్కర్ విగ్రహం ముందు వారు మాట్లాడుతూ ఇటీవల నందికొట్కూరు నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యేకు ప్రొటోకాల్ ప్రకారం ఆహ్వానం అందించకుండా అవమాన పరిచారని ఆరోపించారు. మంత్రి రోజా, ఎంపీ బ్రహ్మానందరెడ్డిలకు దళిత ఎమ్మెల్యేలను అవమానించడమే వారి లక్ష్యమా అన్ని మండి పడ్డారు. 2 కోట్ల రూపాయల ఖర్చుతో రెండు ఇండోర్ స్టేడియంల ప్రారంభోత్సవానికి ఎక్కడ కూడా ఎమ్మెల్యేను కలుపుకొని పోకపోవడం వైయస్సార్సీపి పార్టీకి సిగ్గుచేటని అన్నారు. గతంలో మంత్రిగా పనిచేసిన అనిల్ కుమార్ యాదవ్ హయాంలోనూ స్థానిక ఎమ్మెల్యేకు ప్రోటోకాల్ పాటించలేదని అన్నారు. వివక్షత చూపిన వారిపై తగిన చర్యలు తీసుకోక పోతే ఈ విషయాల పై జాతీయ ఎస్సీ కమిషన్ దృష్టికి తీసుకునిపోతామని అన్నారు. ఫ్లెక్స్లోనూ ఎమ్మెల్యే ఫోటో కానీ.. పేరు కానీ లేకపోవడం దళితులను అవమాన పరచడమేనని అన్నారు. ఈ విషయంపై దళితులందరూ చలో నందికొట్కూరు ఏర్పాటు చేసి ప్రత్యేక ర్యాలీని ఏర్పాటు చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మాలమహానాడు నాయకులు పాల్గొన్నారు.










