
ప్రజాశక్తి-టంగుటూరు: వైసిపి ప్రభుత్వంలో దళితులపై దాడులు పెరిగాయని, అనేక మంది దళితులు చనిపోయారని, ఇందుకు కారకుడైన ముఖ్యమంత్రి జగన్రెడ్డిని తరిమికొట్టేందుకు యావత్ దళిత జాతి కంకణబద్ధులు కావాలని కొండపి శాసనసభ్యులు డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి పేర్కొన్నారు. సోమవారం జరిగిన దళిత సమ్మేళనం కార్యక్రమంలో టంగుటూరు మండల దళిత నాయకులతో కలిసి కొండపి ఎమ్మెల్యే డాక్టర్ స్వామి ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్వామి మాట్లాడుతూ గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసి ఎస్సీ, ఎస్టీలను విద్యావంతులను చేసింది టిడిపి ప్రభుత్వమే అన్నారు. టిడిపి ప్రభుత్వంలో వేసిన సిమెంటు రోడ్లే తప్ప ఈ నాలుగున్నరేళ్లలో జగన్రెడ్డి కనీసం రెండు మీటర్ల సిమెంటు రోడ్డు కూడా వేయలేదని విమర్శించారు. దళితులపై జరిగే అన్యాయాలను బహిరంగపరచడం కోసం చంద్రబాబు నాయుడు అన్ని జిల్లాలలో ఎస్సీ, ఎస్టీ మానిటరింగ్ కమిటీలను ఏర్పాటు చేస్తే జగన్రెడ్డి ఆ కమిటీలను నామరూపాలు లేకుండా చేశాడని స్వామి దుయ్యబట్టారు. పేదరికం పుట్టుకతోనే రాదు. దళితులు అభివృద్ధి చెందాలని చంద్రబాబునాయుడు అన్న మాటలను వైసీపీ నాయకులు వక్రీకరించి ఎవరూ దళితులుగా పుట్టాలని కోరుకోరు అని చంద్రబాబు అన్నట్లుగా వక్రీకరించిన నీచ సంస్కతి వైసీపీది అన్నారు. ప్రభుత్వంలో ఒక్కరు కూడా దళిత సలహాదారులు లేరని తాము వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే మాకు సలహాదారులుగా మేధావులు కావాలని జగన్రెడ్డి అన్నాడని కొండపి ఎమ్మెల్యే డాక్టర్ స్వామి పేర్కొన్నారు. అంటే దళితులలో మేధావులు లేరని అసెంబ్లీలో నిస్సిగ్గుగా మాట్లాడిన జగన్రెడ్డిని తరిమికొట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. గురుకుల పాఠశాలలో చంద్రబాబునాయుడు అదనంగా కొత్త కోర్సులతో సీట్లు కేటాయిస్తే సిఎఫ్ఎంఎస్ పేరుతో ఆ సీట్లన్నింటిని రద్దుచేసి 4 వేల మంది దళిత విద్యార్థులను విద్యకు దూరం చేసిన జగన్ రెడ్డి విద్యార్థుల పాలిట కంస మామగా మారాడని ఎద్దేవా చేశారు. ఎస్సీ కార్పొరేషన్లను సైతం నిర్వీర్యం చేసి దళిత పథకాలన్నింటినీ తుంగలో తొక్కి దళితులకు తీరని అన్యాయం చేసిన జగన్రెడ్డిని తరిమికొట్టాలని ఎమ్మెల్యే స్వామి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టంగుటూరు మండల దళిత నాయకులు ధర్నాసి బ్రహ్మానందం, పిడుగురాళ్ల సురేష్బాబు, తిప్పగుడిసె రమేష్ బాబు, మేడికొండ రవీంద్ర, మేడికొండ శ్రీను, కొమ్ము భానుచందర్, జక్కుల శ్రీను తదితరులు ఉన్నారు.